చిక్కుల్లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. ఎస్సీ సీటులో పోటీపై రాష్ట్రపతికి ఫిర్యాదు
నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఈసారి ఏకంగా అభ్యర్ధిత్వం వివాదంలో చిక్కుకున్నారు. గతంలో క్రైస్తవం స్వీకరించిన సురేష్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బాపట్ల నుంచి ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తూ దళిత సంఘాలు రాష్ట్రపతి కోవింద్ కు లేఖ రాయడం కలకలం రేపుతోంది. తక్షణం విచారణ జరిపి సురేష్ పై చర్యలు తీసుకోవాలని ముంబైకి చెందిన "దళిత్ పాజిటివ్ మూవ్మెంట్" తమ ఫిర్యాదులో కోరింది.
బాపట్ల నుంచి తొలిసారి ఎంపీగా
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ సమయంలో అడ్డుపడ్డారని ఆరోపిస్తూ వైసీపీలో కింది స్ధాయి నేతగా ఉన్న నందిగం సురేష్ ను టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు నానా ఇబ్బందులు పెట్టారు. ఈ విషయం ఆనోటా ఈనోటా వైసీపీ అధినేత జగన్ వద్దకు చేరడంతో ఆయన సురేష్ ను చేరదీసి ఏకంగా ఎంపీ పదవికి సీటిచ్చారు. దీంతో ఆయన 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కూడా రాజధాని ప్రాంతంలో కీలక నేతగా, జగన్ కు సన్నిహితుడిగా సురేష్ పేరు తెచ్చుకున్నారు.
రాజధాని ఉద్యమంలో వివాదాలు
రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించవద్దంటూ ఇక్కడి గ్రామాల రైతులు నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరిస్తుండటంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. అదే సమయంలో రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న సురేష్, ఆయన అనుచరులు తమపై దాడులకు పాల్పడుతున్నారని అమరావతి జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితోనూ సురేష్ కు విభేదాలు వచ్చాయి. అయితే వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్ధితిని చక్కదిద్దాయి.
సురేష్ ఎస్సీ కాదంటూ ఫిర్యాదులు
విచిత్రంగా సురేష్ ను బాపట్ల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీకి దింపినప్పుడు కానీ, ఆయన గెలిచినప్పుడు కానీ ఎలాంటి ఆరోపణలు రాలేదు. కానీ తాజాగా సురేష్ ఎస్సీ కాదంటూ ఆయనపై స్ధానికంగా ఆరోపణలు మొదలయ్యాయి. ఇవి కాస్తా మహారాష్ట్రలోని దళిత సంఘాల వరకూ వెళ్లాయి.
సురేష్ క్రైస్తవుడిగా మారి కూడా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన అంశాన్ని ముంబైకి చెందిన "దళిత్ పాజిటివ్ మూవ్మెంట్" రాష్ట్రపతి కోవింద్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. సురేష్ పై తక్షణం చర్యలు తీసుకుని ఆయన్ను ఎస్సీ రిజర్వుడు సీటు నుంచి ఎంపీగా తొలగించాలని సదరు సంస్ధ ఫిర్యాదులో కోరింది.
సురేష్ అభ్యర్ధిత్వంపై రూల్స్ ఏమంటున్నాయి.
1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఓ దళిత వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే ఇక ఎస్సీ హోదా ఉండదు. ఇదే అంశం ఆధారంగా ఫిర్యాదు చేసిన "దళిత్ పాజిటివ్ మూవ్మెంట్" సంస్థ.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు రాష్ట్రపతి దృష్టికి తెచ్చింది. దీనిపై వెంటనే విచారణ జరిపి, సురేష్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరింది..
హిందూ, దళిత సంఘాల ఫైర్
బాపట్ల ఎంపీ సురేశ్ క్రైస్తవుడిగా ఉంటూ ఎస్సీ రిజర్వుడు స్దానం నుంచి పోటీ చేసి గెలవడంపై హిందూ ధార్మిక సంస్థలు, దళిత వాద సంఘాలు మండిపడుతున్నాయి. రిజర్వేషన్ కోటాలో గెలిచి క్రైస్తవాన్ని స్వీకరించడం ఎస్సీ స్టేటస్ను దుర్వినియోగం చేయడమేనని వారు రాష్ట్రపతికి, లోక్ సభ స్వీకర్కు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అపహాస్యం చేస్తున్న వారిని శిక్షించకపోతే రాజ్యాంగానికి విలువ ఉండదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Recommended Video
సురేష్ తో పాటు మరికొందరిపైనా..
కేవలం సురేష్ మాత్రమే కాదు, ఏఫీలో ఎస్సీ, ఎస్టీ కోటా కింద ఆయా ప్రత్యేక నియోజక వర్గాల నుంచి గెలిచిన చాలా మంది నేతలు క్రైస్తవాన్ని స్వీకరించి బైబిల్ చేతిలో పట్టుకొని దర్జాగా చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ముఖ్యమంత్రి దృష్టిలో పడడానికి ఫోటో ఫోజులు కూడా ఇస్తున్నారని పలు హిందూ సంఘాలు సైతం లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా హిందూ సంస్కృతిపై జరుగుతున్న దాడిగానే అర్థం చేసుకోవాలని హిందూ మత పెద్దలతో పాటు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.