'అనుమతి లేకుండా ప్రపంచస్థాయి రాజధాని ఎలా?': 'క్రికెట్ మోజులో యువత'
అమరావతి: పర్యావరణ అనుమతులు లేకుండా ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రముఖ సామాజికవేత్త శ్రీమన్నారాయణ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులున్నాయని ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ను తప్పుదారి పట్టించిందన్నారు.
రాష్ట్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చినట్లు గ్రీన్ ట్రైబ్యునల్లో కౌంటర్ ఫైల్ చేశారన్నారు. కానీ 1.70 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం మించిన ఏ ప్రాజెక్టుకు అయినా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరి అని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంలో సిద్ధహస్తుడన్నారు.
భూసమీకరణకు భూములు ఇవ్వని గుంటూరు జిల్లా ఉండవల్లి రైతుల పైన కక్ష సాధింపు చర్యలకు ఆరోపించారు. ఉండవల్లిలో పూలింగ్కు ఇవ్వని రైతుల భూముల్లో 200 అడుగుల వెడల్పున రోడ్లు వేయిస్తున్నారన్నారు. దీనివల్ల వందలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోయే ప్రమాదముందన్నారు.
క్రికెట్ మోజులో పడి గ్రామీణ క్రీడలను మర్చిపోతున్నారు: చినరాజప్ప
యువత క్రికెట్ మోజులో పడి గ్రామీణ క్రీడలను మర్చిపోతోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.