Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త జిల్లాల సిత్రాలు- బందరు, కాకినాడపై తీవ్ర ప్రభావం- తీర నగరాలకు లాభం కంటే నష్టమెక్కువ!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం శాస్త్రీయంగా వ్యవహరించినట్లు చెప్పుకుంటున్నా స్ధానిక పరిస్దితులు,, గతంలో ప్రభుత్వాలు ఉన్నతాశయాలతో తీసుకున్న నిర్ణయాలకు మాత్రం తీవ్రంగా భంగం వాటిల్లేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంత నగరాలైన మచిలీపట్నం, కాకినాడ వంటి అప్పటికే జిల్లా కేంద్రాలు కలిగిన చోట్ల కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం సాధించింది శూన్యం కాగా.. ఆయా నగరాలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు.

కొత్త జిల్లాల సిత్రాలు

కొత్త జిల్లాల సిత్రాలు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కోసం ప్రభుత్వం రెండేళ్లుగా కసరత్తు చేసింది. జనాభా, జనసాంద్రత, జిల్లా కేంద్రాలకు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో ఉన్న దూరం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది. అయితే కీలకమైన కొన్ని అంశాల్ని మాత్రం విస్మరించింది. ఇవి గతంలో ప్రభుత్వాలు దూరదృష్టితో తీసుకున్న ప్రజానుకూల నిర్ణయాలు కాగా.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాటికి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో ఆయా నగరాల ఉసురుతీయబోతోందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

మచిలీపట్నం, కాకినాడ గత లక్ష్యాలివే

మచిలీపట్నం, కాకినాడ గత లక్ష్యాలివే

గతంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా కాకినాడను, కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం సుదీర్ఘమైనది, విస్త్రృత ప్రజా ప్రయోజనంతో కూడుకున్నది. అప్పట్లో ప్రభుత్వాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మరో ప్రధాన నగరం రాజమండ్రికే అభివృద్ధి పరిమితం కాకుండా జిల్లా కేంద్రాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం ద్వారా దానికి కూడా అభివృద్ధి ఫలాలు అందేలా చేశాయి.

అలాగే కృష్ణాజిల్లాలో విజయవాడకే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా మచిలీపట్నాన్ని జిల్లా కేంద్రంగా పెట్టారు. తద్వారా ఆయా నగరాల్లో అధికార కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు అక్కడికి వచ్చేవారు. దీంతో ఈ రెండు నగరాలు కొంత అభివృద్ధి చెందాయి. అయినా ఇప్పటికీ వెనుకబాటే.

స్మార్ట్ సిటీ ఇచ్చినా కాకినాడ అంతంతే

స్మార్ట్ సిటీ ఇచ్చినా కాకినాడ అంతంతే

తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఉంటూ ఇప్పుడు కాకినాడ జిల్లా కేంద్రంగా మారబోతున్న కాకినాడ నగరం గతంలో పాశ్చాత్య దేశాల వర్తక కేంద్రంగా ఉండేది. ప్లాన్డ్ సిటీగా, పెన్షనర్ల స్వర్గధామంగా ఇది పేరు తెచ్చుకుంది. అయితే నిన్న మొన్నటి వరకూ తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కువగా అభివృద్ధి చెందిన నగరంగా మాత్రం మారలేకపోయింది. చివరకు కేంద్రం స్మార్ట్ సిటీని ప్రకటించినా మౌలిక సౌకర్యాల అభివృద్ధి మాత్రమే జరిగింది. మిగతా పరిస్ధితులన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

ప్రజల జీవన ప్రమాణాలు కానీ, కొత్తగా భారీ పరిశ్రమల ఏర్పాటు కానీ జరగలేదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా తొలగించి కాకినాడ జిల్లా ఏర్పాటు చేసి కాకినాడ జిల్లా కేంద్రం చేయడం వల్ల ఆ అభివృద్ధి నెమ్మదిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో వచ్చినన్ని పరిశ్రమలు మరోసారి ఇక్కడికి వస్తాయా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

 బందరుకు మరిన్ని కష్టాలు

బందరుకు మరిన్ని కష్టాలు

నిన్న మొన్నటివరకూ కృష్ణాజిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం ఇప్పుడు అదే పేరుతో జిల్లాగా ఏర్పాటు కావడంతో పాటు జిల్లా కేంద్రం కొనసాగబోతోంది. దీని వల్ల బందరుకు లభించే అదనపు ప్రయోజనం కూడా శూన్యం. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ శివార్లు కలవడం మినహా బందరుకు ఈ కొత్త జిల్లా వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చెప్పే పరిస్ధితుల్లో ప్రభుత్వం కానీ, అక్కడి ప్రజాప్రతినిధులు కానీ లేరు. ముఖ్యంగా గతంలో కృష్ణాజిల్లా కేంద్రంగా బందరు కాస్తో కూస్తో అభివృద్ధి చెందింది.

నిధులు కూడా వచ్చాయి. ఇప్పుడు మచిలీపట్నం జిల్లా ఏర్పాటుతో విజయవాడతో పాటు అభివృద్ధి చెందిన మెట్ట ప్రాంతాల అభివృద్ధి బందరుకు విస్తరించడం ఆగిపోవడం ఖాయం. గతంలో ఉమ్మడి జిల్లాలో బందరు పోర్టుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయినా ముందడుగు పడటం లేదు. ఇప్పుడు కొత్త జిల్లాతో బందరు పోర్టు నిర్మాణంపైనా ప్రభావం పడబోతోంది.

మచిలీపట్నం, కాకినాడకు నష్టమిదే

మచిలీపట్నం, కాకినాడకు నష్టమిదే

గతంలో ఉమ్మడి జిల్లాల్లో జిల్లా కేంద్రాలుగా ఉన్నప్పుడు కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి జిల్లాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి అభివృద్ధి ఇక్కడికి కాస్తో కూస్తో విస్తరించింది.

ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో అవి స్వయం సమృద్ధి సాధించక తప్పదు. అందులో విఫలమైతే మరిన్ని కష్టాలు పెరగడం ఖాయం. అసలే తీర ప్రాంతాలకు నిధుల కొరత వేధిస్తోంది. ఇప్పుడు ఇక్కడ కొత్త జిల్లాల ఏర్పాటుతో పర్యాటకం మినహా మిగిలిన రంగాల్లో అభివృద్ధి విస్తరణ ఆగిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ప్రభుత్వం దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు సూచిస్తుందో చూడాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+