లాజిక్ మిస్సయింది ఎవరు ? సాయిరెడ్డి-లోకేష్ ఇద్దరి డౌటూ అదే ! మధ్యలో జగన్, బాబాయ్ !
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ ముదురుతోంది. ఏడాదిన్నరలో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న ఏపీలో ఇప్పుడు ఇరుపార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం పతాకస్ధాయికి చేరుతోంది. ఇదే క్రమంలో ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే ప్రశ్న సంధిస్తున్నారు. అది 'ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు ?' ఇంతకీ లాజిక్ ఎవరు మిస్సవుతున్నారు ?
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు ?
రాష్ట్రంలోని అధికార వైసీపీ, విపక్ష టీడీపీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతలు విజయసాయిరెడ్డి, నారా లోకేష్. ఇప్పుడు వీరిద్దరూ రెండు అంశాలకు సంబంధించి లాజిక్ గురించి పరస్పరం ప్రశ్నలు సంధించుకుంటున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారంటూ వీరిద్దరూ ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలు వారు ఎవరికి సంధిస్తున్నారో అందరికీ తెలుసు, అయితే వారు మిస్సయ్యారంటున్న లాజిక్ నిజంగానే మిస్సయిందా లేదా అనేదే చర్చ. దీంతో ఈ రెండు ప్రశ్నలపై ఇరుపార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.
నారా లోకేష్ లాజిక్ ప్రశ్న
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య, కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి సీటు కేటాయింపు వ్యవహారాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ ప్రశ్న వేశారు. "బాబాయ్ ని ఒప్పించి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తే నాయకుడివి అవుతావ్... బాబాయ్ ని లేపేసి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తే నేరస్తుడివి అవుతావ్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్ రెడ్డి! వివేకా గారిని అత్యంత కిరాతకంగా చంపించింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి.. వారిని కాపాడుతుంది జగన్ రెడ్డి అని షర్మిల సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు...మీరు వదిలిన బాణం అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే సమాధానం ఇచ్చింది." అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి లాజిక్ కౌంటర్
దీనికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా ఎల్లోమీడియా పేరుతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "జైలుకు వెళ్ళే వారంతా నేరస్తులు కాదురా ఎల్లోస్! అలా అయితే గాంధీజీ నుంచి చిదంబరం వరకు అందరూ నేరస్తులే అవుతారు. కోర్టులో నేర నిరూపణ జరిగి శిక్ష పడితేనే నేరస్తుడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతోంది పచ్చ కుల మీడియా?" అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. తద్వారా జైలుకు వెళ్లొచ్చిన తనను, జగన్ ను నేరస్తులుగా పేర్కొంటూ టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టార్గెట్ చేశారు.