అసెంబ్లీలో జగన్ తొలిరోజు ఎలా గడిచిందంటే ?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధిస్తే.. అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం 11 సీట్లతో చతికిలపడింది. ఈ నేపథ్యంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసలు అసెంబ్లీకి హాజరవుతారా అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనికి కారణం గతంలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక అప్పటి విపక్ష టీడీపీతో ఆయన పార్టీ, ప్రభుత్వం వ్యవహరించిన తీరే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీకి వచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన వైఎస్ జగన్ ఈసారి విపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేల తరహాలోనే కారు శాసనసభ ప్రాంగణం బయటే ఉంచి లోపలికి నడుచుకుని వస్తారని భావించినా ప్రభుత్వం మాత్రం అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ సొంతకారులోనే అసెంబ్లీ లోపలికి వచ్చారు. ఆ సమయంలో కారును నేరుగా పంపకుండా అనుమతుల కోసం పోలీసులు ఆపారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతలు జగన్ మామయ్యా, బైబై జగన్ అని నినాదాలు చేస్తూ కనిపించారు. అయినా జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే కారులో నుంచే దణ్ణం పెట్టుకుని వెళ్లిపోయారు. అప్పటికే అసెంబ్లీలో జగన్ కు సాధారణ ఎమ్మెల్యే తరహాలో కాకుండా మాజీ సీఎంలా పరిగణించాలని, సీఎం, మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరడంతో చంద్రబాబు సరేనన్నారు. దీంతో జగన్ నేరుగా అసెంబ్లీకి రావడం, సీఎం, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.
శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ఆర్ సీపీ అధినేత @ysjagan గారు. pic.twitter.com/SQ3bxeS0V6
— YSR Congress Party (@YSRCParty) June 21, 2024
అసెంబ్లీలో ఎడమచేతివైపు మూలన బీజేపీ తర్వాత సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్న జగన్.. తన పేరు పిలవగానే వచ్చి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం కోసం నడిచి వస్తున్న సమయంలో సభలో ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లారు. అయితే అధికార కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ఆయన నమస్కారానికి స్పందించలేదు. చంద్రబాబు మాత్రం ప్రతి నమస్కారం చేసారు. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్ తన పూర్తి పేరు చదివేందుకు తడబడ్డారు. జగన్ మోహన్ అనే నేను అని చెప్పాక తిరిగి జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం పూర్తి చేశారు.
ఆ వెంటనే అసెంబ్లీలో ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటికి వెళ్లిపోయారు జగన్. అసెంబ్లీ లాబీల్లో నుంచి వైసీఎల్పీకి వెళ్లిన జగన్.. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎలా వ్యవహరించారో వారికి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications