తెలంగాణ, కర్నాటకకు రోల్ మోడల్ గా జగన్ సర్కార్...ఈ రెండు అంశాల్లో ఆసక్తి..
ఏపీలో నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పలు సంస్కరణలు అమలు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో హామీల్ని దాదాపుగా అమలుచేయడంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా పలు రంగాల్లో సంస్కరణలు అమలు చేస్తోంది. వీటి ప్రయోజనం ప్రజలకు అందిందా లేదా అన్న అంశంలోనూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంస్కరణల్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
ఏపీలో అమలవుతున్న రెండు విధానాల్ని పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రేషన్ విధానాన్ని కర్నాటక ప్రభుత్వం ఆసక్తిగా గమనిస్తుండగా.. విద్యా సంస్కరణల్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండు అంశాల్లో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంత సక్సెస్ అయిందన్న దానిపై ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులు పరిశీలన చేస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చి వివరాలుతీసుకుని వెళ్తున్నారు.

తాజాగా నిన్న విజయవాడ వచ్చిన కర్నాటక మంత్రి మునియప్ప రేషన్ పంపిణీ విధానం గురించి ఆరా తీశారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం విజయవంతంగా ఇంటింటికీ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ విధానంపై పరిశీలన చేశారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని ఆయన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ అధికారులు ఆయనకు కావాల్సిన వివరాలు అందించారు.
మరోవైపు వైసీపీ సర్కార్ విజయవంతంగా అమలు చేస్తున్న విద్యాసంస్కరణలపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.ఐటీ పరిజ్ఞానం వాడకంతో స్కూళ్లకు రాని విద్యార్ధులను ట్రాకింగ్ చేస్తున్న విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు విధానంపై తెలంగాణ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. యాప్స్ ద్వారా విద్యార్ధుల హాజరు తీసుకోవడం, టీచర్ల హాజరును ఫేషియల్ విధానంలో తీసుకోవడం, మధ్యాహ్న భోజనం చేసే వారిని గుర్తించి గణన చేయడం, మొత్తంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిమ్స్) అమలు విధానాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తెలంగాణ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications