టీడీపీ మహానాడుకు వైసీపీ పరోక్ష సాయం ? రెండు విధాలుగా లాభం ! ఎలాగో తెలుసా?
ఏపీలో టీడీపీ తాజాగా నిర్వహించిన మహానాడు ఊహించినదానికంటే ఎక్కువగా విజయవంతమైంది. ఈ మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం, ప్రైవేటు వాహనాలు కూడా ఇవ్వకుండా యాజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇది కాస్తా టీడీపీ కార్యకర్తలు, నేతల్లో మరింత పట్టుదల పెంచింది. చివరికి వారు తమ వ్యక్తిగత వాహనాల్లో తరలివచ్చారు. అంతే కాదు టీడీపీకి మరో భారీ మేలు కూడా జరిగింది.
టీడీపీ మహానాడు విజయవంతం
ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు గతంలో ఎన్నడూ లేనంత భారీ జన సందోహంతం పోటెక్కింది. ప్రస్తుతం వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టడానికే టీడీపీ కార్యకర్తలు, నేతలు బెంబేలెత్తుతున్న పరిస్దితుల్లో మహానాడుకు భారీ ఎత్తున తరలివచ్చి నేతలు, కార్యకర్తలు దీన్ని విజయవంతం చేశారు. దీంతో టీడీపీలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. చాలాకాలం తర్వాత ఎక్కడెక్కడి నుంచో భారీగా తరలివచ్చిన కార్యకర్తల్ని చూసి నేతలు కూడా జోష్ లో మునిగిపోయారు.
సక్సెస్ వెనుక వైసీపీ?
టీడీపీ మహానాడు ఇంతలా సక్సెస్ కావడం వెనుక అధికార వైసీపీ పరోక్షంగా కీలకపాత్ర పోషించింది. ప్రధానంగా మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్న వైసీపీ సర్కార్.. అనంతరం టీడీపీకి ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు కూడా బస్సులు, ఇతర వాహనాలు ఇవ్వకుండా విజయవంతంగా అడ్డుకుంది. కానీ ఇదే అంశం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో పట్టుదల పెంచింది. ఎవరికి వారు సొంత వాహనాల్లో ఒంగోలుకు తరలివచ్చారు. దీంతో మహానాడు ప్రాంగణం కిక్కిరిరిపోయింది. వైసీపీ సర్కార్ వాహనాల్ని అడ్డుకోకుండా ఉంటే టీడీపీ మహానాడుకు ఇంతలా కార్యకర్తలు పోటెత్తే పరిస్ధితి ఉండేది కాదనేది టీడీపీ నేతల మాటల్లోనే వినిపించింది.
టీడీపీని ఆదుకున్న వైసీపీ?
టీడీపీ మహానాడుకు వైసీపీ సర్కార్ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ద్వారా మరో మేలు కూడా చేసింది. మహానాడుకు బస్సులు తీసుకోకపోవడం వల్ల టీడీపీకి భారీ ఎత్తున నిధులు మిగిలాయి. ప్రైవేటు వాహనాల్ని సైతం కట్టడి చేయడంతో ఆ మేరకు డబ్బులు కలిసొచ్చాయి. అసలే ముందస్తుఎన్నికల రాగాలు వినిపిస్తున్న వేళ అవే వాహనాలు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సమకూర్చి ఉంటే వాటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్ధితి ఉండేది. ఆ డబ్బంతా టీడీపీకి మిగిలినట్లయింది.