పవన్ స్ధానంలో పురందేశ్వరి ! ఆ పాయింట్ మాత్రం వదలని వైసీపీ ?
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు కూడా రాటు దేలుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నారు. అదే క్రమంలో కొత్తగా ఏపీ బీజేపీ ఛీఫ్ బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా వచ్చీ రాగానే వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా తన వ్యూహం ఎలా ఉండబోతోందో చెప్పేశారు. దీంతో పోరు మరో మలుపు తిరిగింది.
ఇన్నాళ్లూ చంద్రబాబు, లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్దూ వచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదువుతున్నాడనేది సాయిరెడ్డి అభ్యంతరం. ఇదే విషయాన్ని గత నాలుగేళ్లుగా పలుమార్లు ఓపెన్ గా ప్రస్తావించడంతో పాటు ట్వీట్లలోనూ తను చేసే విమర్శల్లో వాడుకున్నారు. అయితే దీనిపై టీడీపీ, జనసేన మాత్రం ఎక్కడా స్పందించలేదు. అయినా సాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు ఈ పాయింట్ తో వార్ కొనసాగిస్తున్నారు.

కానీ ఇప్పుడు రూటు మార్చారు. దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు ఇదే వ్యవహారాన్ని అంటగడుతూ వైసీపీ నేతలు దాడి మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకూ సోము వీర్రాజు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకూ ఈ విషయం ప్రస్తావించని వైసీపీ నేతలు.. ఇప్పుడు చంద్రబాబుకు వదిన వరసయ్యే పురందేశ్వరి ఎంట్రీ ఇవ్వగానే ఆమెపై ఇవే విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ పై పురందేశ్వరి విమర్శల్ని చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ గానే పేర్కొంటూ సాయిరెడ్డి ట్వీట్లు పెడుతున్నారు.
మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే పురందేశ్వరి త్వరలో పవన్ కళ్యాణ్ ను కలుస్తానని ప్రకటించారు. అయితే ఆమె ఇంకా పవన్ ను కలవలేదు. ఇదే సమయంలో గతంలో పవన్ పై చేసిన విమర్శల్ని ఇప్పుడు పురందేశ్వరిపైకి మళ్లించడం ద్వారా రాబోయే ముప్పును వైసీపీ ముందే గ్రహించిందా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు బాటలోనే రేపు పవన్ అయినా పురందేశ్వరి అయినా పయనించబోతున్నారని, ఈ ముగ్గురిని కలిపి టార్గెట్ చేయడమే తమ వ్యూహంగా వైసీపీ చెప్పుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం మరింత వేడెక్కబోతోందని అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications