కృష్ణమ్మ పరవళ్లు:నాలుగేళ్ల తరువాత నిండు కుండలా నాగార్జున సాగర్...పులిచింతల కూడా ఫుల్లే!
గుంటూరు:కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తుండటంతో పై నుంచి వచ్చిపడుతున్న వరద నీటితో నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టులో కృష్ణమ్మ నిండుగా పరవళ్లు తొక్కుతోంది.
ఈ క్రమంలో సాగర్ జలాశయంలో నీరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా రావడంతో అధికారులు రెండు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే 14వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న టెయిల్పాండ్కు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 595 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులుగా ఉంది. మరోవైపు సాగర్ నుంచి వదులుతున్న నీటితో పులిచింతల కూడా ఫుల్ అవుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.

నిండుకుండల్లా...జలాశయాలు
కృష్ణానదికి పైనుంచి వస్తున్న వరద నీటితో దిగువన ఉన్న జలాశయాలు నిండుకుండల్లా నీటితో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల గరిష్ట పరిమితికి నీరు చేరుకుంటుండటంతో వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 1.83 లక్షల క్యూసెక్కులు చేరుకోగా...అక్కడి నుంచి అంతే మొత్తంలో నాగార్జునా సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నిండుకుండలా మారి గరిష్ఠ మట్టానికి మరో 5 అడుగులు మాత్రమే ఉండటంతో ఆదివారం గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఇంజినీర్లు తెలిపారు.

పులిచింతల కూడా...ఫుల్ అవనుందా?
మరోవైపు సాగర్లో విద్యుదుత్పత్తి అనంతరం మరో 35 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు పులిచింతలకు చేరడంతో ప్రాజెక్టులో మట్టం అంతకంతకూ పెరుగుతోంది. సాగర్కు 1.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నందున విద్యుదుత్పత్తి, కాలువలకు 50 వేల క్యూసెక్కులు పోగా ఇంకా లక్ష క్యూసెక్కులు జలాశయంలో నిల్వ చేస్తున్నారు. ఆదివారం ఉదయానికి సాగర్లో నీటి మట్టం 585 అడుగులు దాటుతున్నందున ఎగువ నుంచి వచ్చే వరదను అనుసరించి గేట్లు ఎత్తి నదిలోకి నీటిని విడుదల చేసేస్తారు. పులిచింతల గరిష్ఠ నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం వస్తున్న వరద మూడు రోజులు కొనసాగితే ఈ ప్రాజెక్టు కూడా నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కృష్ణా డెల్టా రైతులకు ఖరీఫ్లో సాగుకు పుష్కలంగా నీరుని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.

పులిచింతలతో...తీరిన డెల్టా చింత
కృష్ణానదికి వరద ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగితే డెల్టా రైతులకు బాగా కలిసిరానుంది. పులిచింతలలో గతంలో 33 టీఎంసీల వరకు నిల్వ చేయగా...ఈసారి క్రమంగా ఆ మట్టం పెంచుతూ గరిష్ఠస్థాయికి తీసుకెళ్లనున్నారు. అప్పుడు పట్టిసీమ నుంచి వస్తున్న జలాలు నీటి అవసరాలకు సరిపోని పక్షంలో పులిచింతల నుంచి విడుదల చేసి డెల్టా అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. పట్టిసీమ, స్థానిక వాగుల ద్వారా వచ్చే లభ్యత, డెల్టాలో అవసరాలు బేరీజు వేసుకుంటూ పులిచింతల నుంచి నీటిని అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని వల్ల పులిచింతల పరిధిలోని డెల్టా రైతులకు సాగు నీటి కష్టాలు తప్పుతాయి. వరి సాగు, చేపల చెరువులు కలిపి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 13.08 లక్షల ఎకరాలకు ఇప్పటికే నీటి భరోసా లభించినట్లే నంటున్నారు. సెప్టెంబరులోనే ప్రాజెక్టుకు జలకళ రావడం, ఇంకా రెండు నెలల వర్షాకాలం ఉండటంతో ఈ ఏడాది నీటి కష్టాలు ఉండవని అధికారుల అంచనా.

ముంపు ముప్పు...అప్రమప్తం
ఈ క్రమంలో ఎగువ నుంచి వచ్చే వరద మొత్తం ఒకేసారి గరిష్ఠ మట్టం వరకు నిల్వ చేయకుండా తొలిసారి ప్రాజెక్టు నింపేప్పుడు తీసుకోవాల్సిన మార్గదర్శకాలకు అనుగుణంగా పులిచింతలలో నీటిని నిల్వ చేస్తామని కృష్ణా డెల్టా అధికారులు మీడియాకు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించాలని సూచించామన్నారు. మరోవైపు నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల సమాచారంతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పులిచింతల ముంపు గ్రామాల్లో ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. పోలీసులు, రెవెన్యూవర్గాలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. నదిలో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున ప్రజలు కూడా స్వచ్చందంగా ముంపు గ్రామాల నుంచి వెళ్లిపోతున్నారు. వీరితోపాటు నదీ తీర మండలాల్లోనూ ప్రత్యేకాధికారులను నియమించి అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications