సంచలనం:తాడేపల్లిలో భారీ చోరీ: రూ 2.50 కోట్ల ఆభరణాల దోపిడీ
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకున్న ఓ భారీ చోరీ సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దొంగలు సుమారు రూ.2.50 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.రాజధాని ప్రాంతంలో సిఎం నివాసానికి సమీపంలోనే ఈ భారీ దొంగతనం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...విజయవాడ క్లబ్ సమీపంలో ఉన్న తాడేపల్లి సుందరయ్యనగర్ లోని సత్యాగార్డెన్స్లో పెడవర్తి రమేష్ పై పోర్షన్ లో నివసిస్తుండగా, అతని తల్లిదండ్రులు కింద పోర్షన్ లో నివాసం ఉంటున్నారు. ఇటీవల రమేష్ తండ్రి అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితమే హాస్పిటల్ లో చేర్పించారు.

దీంతో రమేష్ ఉదయమంతా తండ్రి దగ్గర ఉండి సపర్యలు చేసి రాత్రికి ఇంటికొచ్చి పడుకున్నాడు. అయితే అర్థరాత్రి దాటాక కింద పోర్షన్లోని కిటికీ గ్రిల్ ఊచలు కోసి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు బీరువా తెరిచి 75 కాసుల బంగారం, కిలో వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. అనంతరం దుండగులు పై పోర్షన్లోనూ చోరీకి ప్రయత్నించారని, అయితే కుక్క అరవడంతో రమేష్ నిద్రలేవడం వల్ల దొంగలు పరారైనట్లు రమేష్ చెబుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
రమేష్ ఫిర్యాదుతో సంఘటనా స్థలాన్ని డిఎస్పి రామాంజనేయులు, మంగళగిరి సిఐ మధుసూదనరావు పరిశీలించారు. గుంటూరు నుండి డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మరోవైపు జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దొంగతనం ఇంటి సమాచారం బాగా తెలిసిన వారిపనేనని స్థానికులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.












Click it and Unblock the Notifications