సారీ అంటూ అక్కకి మేసేజ్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
విజయవాడ: కట్టుకున్న భర్త నిరంతరం అనుమానంతో వేధిస్తుంటే తట్టుకోలేకపోయిన ఓ భార్య తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం రామవరంలో బుధవారం చేసుకుంది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్రం కలకలం సృష్టించింది.
రామవరం గ్రామానికి చెందిన కలిదిండి సరస్వతి(35) తన ఇద్దరు కుమారులు సాయివర్మ(14), హర్షవర్ధన్(11)లతో సహా ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం సర్వస్వతి పెద్ద అక్క ఫోన్ చేస్తే, ఎంతకీ ఫోన్ ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోన్ చేసింది.
ఆ సమయంలో పోలంలో పనులు చేసుకుంటున్న పక్కింటి వారు ఇంటికి వచ్చి కిటీలోనుంచి చూడగా ముగ్గురూ ఫ్యాన్కు నిర్జీవంగా వేలాడుతూ కనిపించడాన్ని చూసి తిరిగి అక్కకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం తలుపులను తెరిచి మృతేదేహాలను బయటకు తీశారు.
పోలీసుల కథనం ప్రకారం రామవరం గ్రామానికి చెందిన కలిదిండి నరసింహ రాజుకు భీమిలి మండలం చిప్పాడ దగ్గర్లోని మూలకుద్దు గ్రామానికి చెందిన సరస్వతితో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. మొదట్లో వీరిద్దరూ బాగానే ఉన్నా ఆ తర్వాత కొన్నాళ్లుగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. నరసింహ రాజు లారీ డ్రైవర్గా పనిచేసేవాడు.
తరచూ భార్యను హింసిస్తుండేవాడని స్థానికులు చెబుతున్నారు. అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉంటే సరస్వతికి ఇద్దరు అక్కలున్నారు. పెద్దక్క కన్నమ్మ విజయనగరంలోని గాజుల రేగలో నివముంటుండగా, గత కొన్నాళ్లుగా సరస్వతి తల్లిదండ్రులు కూడా ఈమె వద్దే నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో సరస్వతి తండ్రి జనవరి 6న విజయనగరంలో మృతి చెందారు. విషాదంతో ఉన్న తల్లి వద్ద కొన్ని రోజులు ఉందాయని వెళ్లంది. అయితే సరస్వతిని సంక్రాంతికి తమ పెద్దలకు బట్టలు చూపించాలని వెంటనే పండగకు రమ్మని భర్త ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయం లో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.
దీంతో సరస్వతి తల్లి రమాదేవి ఇద్దరినీ మందలించి సయోధ్య కుదిర్చి కూతుర్ని అల్లుడితో పంపించింది. ఇంతలోనే సరస్వతి ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని తాము ఊహించలేదని కన్నతల్లి, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
తన కుమార్తె చావుకి అల్లుడు అల్లుడు నరసింహరాజుపైనే తమకు అనుమానం ఉందని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై తిరుపతిరావు, సీఐ రవికుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. భార్య ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుకున్న నరసింహరాజు కూడా అక్కడకు చేరుకున్నాడు.
సరస్వతి తన ఫోన్లో చివరగా అక్కా సారీ! అంటూ తన పెద్దక్క కన్నమ్మకు సెంట్కాని మెసేజ్ను పెట్టి ఉండటాన్ని పోలీసులు గమనించారు. మరోవైపు క్రైం డీఎస్పీ కృష్ణప్రసన్న బుధవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ ఆత్మహత్యలపై సీఐ రవికుమార్ మాట్లాడుతూ సంఘటనను లోతుగా పరిశీలిస్తే గానీ పూర్తి వివరాలు వెల్లడించలేమన్నారు. కేసు నమోదు చేసుకుని వెంటనే విచారణ ప్రారంభించామన్నారు.
ఆత్మహత్య చేసుకునే సమయంలో సరస్వతిని కుమారులిద్దరూ ప్రతిఘటించలేదా? అమ్మ నువ్వు చనిపోవద్దు, నీకు తోడుగా మేముంటాం అనే విషయాన్ని కూడా చెప్పలేకపోయారా? అంతేకాదు పిల్లలిద్దరినీ సరస్వతి ఎలా ఉరికి సిద్ధం చేసిందన్నది ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.