హైద్రాబాద్: సెమీ యుటిపై డైలమా, తెలంగాణ అసెంబ్లీ?
ఢిల్లీ తరహా అయితే గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ లేదా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూమి, ఫీజులు అంశాన్ని కేంద్రం నేరుగా పర్యవేక్షిస్తుంది. ఢిల్లీని కేంద్రపాలిత రాష్ట్రం చేసే ముందు పరిపాలన విధానం ఎలా ఉండాలనే అంశంపై అప్పటి సర్కారియా, అనంతరం బాలకృష్ణన్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సుల ఆధారంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్లో పరిపాలనా, న్యాయ వ్యవస్ధలను ఏర్పాటు చేయనున్నారు.
దీని కోసం రాజ్యాంగ సవరణ కూడా అవసరమని కేంద్రం గుర్తించింది. ఢిల్లీలో భూమి, పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఫీజులపై కేంద్ర హోంశాఖకు నియంత్రణ ఉంటుంది. ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతి భద్రతలను పర్యవేక్షించే పోలీసు కమిషనర్ నేరుగా గవర్నర్ లేదా చీఫ్ అడ్మినిస్ట్రేటర్కు జవాబుదారీగా ఉంటారు. భూమి, పబ్లిక్ ఆర్డర్, ఫీజుల ఇతర అంశాలకు సంబంధించి ఇతర విభాగాధికారులు కూడా గవర్నర్ ఆదేశాల మేరకు నడుచుకుంటారు.
హైదరాబాద్కు మాత్రం ఢిల్లీ తరహా అసెంబ్లీని ఏర్పాటు చేయరు. నిర్దేశించిన ఉమ్మడి రాజధాని పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తెలంగాణ అసెంబ్లీలోనే ఉంటారు. తెలంగాణ అసెంబ్లీకి ఉమ్మడి రాజధాని పరిధిలో పోలీసు, భూమి, పబ్లిక్ ఆర్డర్, ఫీజులపై శాసనాధికారాలు, పాలనాధికారాలు ఉండవు. ఢిల్లీ కేంద్రపాలిత రాష్ట్రం చేసినందుకు 1991లో 69వ రాజ్యాంగ సవరణ చేశారు.
పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చేయాలంటే ముందు సరిహద్దును ఖరారు చేయాలి. ఆ మేరకు పరిధిలో పరిపాలనా, విధి విధానాల అమలుకు రాజ్యాంగ సవరణను కూడా చేయాల్సి ఉంటుంది. నగరాభివృద్ధి, ఆసుపత్రులను కూడా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని సీమాంధ్ర ప్రతినిధులు కేంద్రంపై వత్తిడి తెస్తున్నారట.