హైదరాబాద్కు ఇంక్యుబేటర్: నగరమంతా వైఫై సౌకర్యం
హైదరాబాద్: నూతన కంపెనీల కోసం దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్తోపాటు, హైదరాబాద్ నగరమంతా వైఫై సౌకర్యం విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంక్యుబేటర్ ఏర్పాటుకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) వంటి ప్రముఖ విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలో ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావుతో కలిసి సిఎం కెసిఆర్ ఈ రెండు శాఖలను సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు రానున్న ఐటిఐఆర్ ప్రాజెక్టుకు కావాల్సిన వౌలిక సదుపాయల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటి హబ్గా విస్తరించిందని, ఐటిఐఆర్ ప్రాజెక్టుతో గచ్చిబౌలిలో ఐటి పరిశ్రమ మరింత విస్తరించడంతోపాటు, కొత్తగా మహేశ్వరం, పోచంపల్లి ఐటీ హబ్లుగా మారనున్నాయని పేర్కొన్నారు.

ఐటిఐఆర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్కు మహార్దశ రానుందని చెప్పారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను అంతర్జాతీయ స్థాయి సంస్థకు అప్పగించాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. సరికొత్త ఆలోచనలకు, సృజనాత్మకత, పరిశోధన, వినూత్న సేవలు, ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఇంక్యుబేటర్ ఉపయోగపడనుందని ఐటి మంత్రి కెటిఆర్ అన్నారు. అలాగై వైఫై ఏర్పాటు చేయడం వల్ల ఐటి కంపెనీలకే కాకుండా, సామాన్యులు కూడా లబ్దిపొందుతారని తెలిపారు.
ఆరు నెలల్లోగా ఇంక్యుబేటర్, వైఫై ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ విధానాలు రూపొందించేందుకు పారిశ్రామిక వర్గాల సూచనలు, సలహాలు తీసుకుంటామని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ దశగా నాస్కామ్, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ)లతో చర్చిస్తున్నట్టు తెలిపారు. పెట్టుబడులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు, ఐటిశాఖ, సిఎం కార్యాలయాన్ని అనుసంధానం చేస్తూ సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications