హైదరాబాద్ అందరిదీ: పల్లె, డిగ్గీపై సభా హక్కుల నోటీసు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు అందరిదని తెలుగుదేశం పార్టీ నేత పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. గురువారం శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన జరిగిన చర్చలో పల్లె మాట్లాడారు. విభజన బిల్లు పైన మాట్లాడాల్సిన దుస్థితి వస్తుందని తాను అనుకోలేదన్నారు. తొమ్మిది కోట్ల మంది ప్రజల జీవన్మరణ సమస్య ఇది అన్నారు.
తాను ఎంతో వేదనగా ఈ చర్చలో పాల్గొంటున్నాని చెప్పారు. అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్య వైషమ్యాలు, కక్షలు కల్పించారని పల్లె కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ధర్మబద్దంగా, హేతుబద్దంగా లేదన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి గతంలో సమైక్యాంధ్రకు మద్దతు పలికిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ బిల్లును యుద్ద విమానంలో పంపించవల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పూనుకున్నారన్నారు. 371 డి అంశాన్ని రాజ్యాంగ నిపుణులే తేల్చాలని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటులో ఎందుకు పెట్టలేదన్నారు. రెండు రాష్ట్రాలు తీర్మానం చేశాకే విశాలాంధ్రను ఏర్పాటు చేశారన్నారు.
తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాడు విభజన కుట్రకు తెరలేపారని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడాలను లేఖలో కోరారన్నారు. వైయస్ నాటిన విష వృక్షం ఇప్పుడు మహా వృక్షమైందన్నారు. ఇడుపులపాయలో జగన్, పరకాల ఉప ఎన్నికల్లో విజయమ్మ తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తున్నామని చెప్పలేదా అని ప్రశ్నించారు.
సీమాంధ్ర ప్రజల గొంతు కోసి విభజనపై కేంద్రం ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని యూపి అసెంబ్లీ తీర్మానం చేసినా అక్కడ విడగొట్టలేదని, ఇక్కడ తీర్మానం చేయకున్నా విభజిస్తున్నారన్నారు. బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. విడిపోతున్న రాష్ట్రానికి రాజధానిని కట్టడం అన్యాయమన్నారు. దేశవ్యాప్తంగా 23 కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్లు వినిపిస్తున్నాయని చెప్పారు.
బిల్లుకు తలా తోక లేదన్నారు. ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలో లేదన్నారు. రాష్ట్రం గురించి తెలియని వారు రాష్ట్ర విభజనలో పాలు పంచుకుంటున్నారన్నారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారుకు ఎలా రక్షణ కల్పిస్తారో చెప్పాలన్నారు.
డిగ్గీపై సభా హక్కుల నోటీసు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.
వట్టిపై పొన్నాల
అంతకుముందు మంత్రి వట్టి వసంత్ కుమార్ మాట్లాడుతుండగా.. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కల్పించుకొని వట్టి పదే పదే మేము అని చెప్పకూడదని, ఆయన తన అభిప్రాయం మాత్రమే చెప్పాలన్నారు. ఆ మాటలను రికార్డుల నుండి తొలగించాలన్నారు. దానికి వట్టి మాట్లాడుతూ తాను తన ప్రాంత ప్రజల ఆవేదననే చెప్పానని, అభ్యంతరకర భాష మాట్లాడలేదన్నారు.












Click it and Unblock the Notifications