రేప్: ఐటి జోన్లో టెక్కీ తొలి బాధితురాలు కాదా?
కొద్ది వారాల క్రితం ఐటి జోన్లో తాను ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లి, నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు సతీష్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు శుక్రవారంనాడు వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి ఆధునికమైన వస్త్రధారణలో ఉందని, తొలుత ఆమె కారు వెనకసీట్లో కూర్చుందని, ఆ తర్వాత ముందు సీట్లోకి వచ్చి తనకు సుఖాన్ని ఇవ్వడానికి అంగీకరించిందని సతీష్ చెప్పినట్లు వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.
డబ్బు కోసం ఆమె అందుకు అంగీకరించిందని, ఆమె సెక్స్ వర్కర్ కావచ్చునని అంటున్నారు. గతంలో సతీష్, వెంకటేశ్వర్లు ఏమైనా ఇటువంటి నేరాలకు పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తాను అత్యాచారానికి ఇష్టపడలేదని, సతీష్ బెదిరించడంతో టెక్కీపై అత్యాచారానికి ఒడిగట్టానని వెంకటేశ్వర్లు చెప్పిన విషయం తెలిసిందే.
అయితే, వెంకటేశ్వర్లు మాటలను పోలీసులు పూర్తిగా నమ్మడం లేదు. మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనపై జరిగిన లైంగిక దాడిపై ఫిర్యాదు చేయకపోవడంతో వారు ఇటువంటి నేరాలకే గతంలో కూడా పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
నేరం చేయడానికి కారు నెంబర్ ప్లేట్లను మార్చడం అనేది కూడా అనుమానాలకు తావిస్తోంది. నేరానికి ముందు వోల్వో కారుకు తెల్లరంగు మీద నెంబర్ రాసిన ప్లేట్ ఉంది. నేరం చేసిన తర్వాత సతీష్ నెంబర్ ప్లేట్ బ్యాక్ గ్రౌండ్ మార్చాడు. ఆ రకంగా దాన్ని క్యాబ్గా చూపించేందుకు ప్రయత్నించాడు. టెక్కీ మిత్రులు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కారు కోసం పోలీసులు వేట సాగించారు. అయితే, సతీష్ చేసిన నెంబర్ ప్లేట్ మార్పిడి వ్యవహారం వల్ల వెంటనే పట్టుకోవడం సాధ్యం కాలేదు.
వరంగల్లోని తుమ్మలకుంటకు చెందిన సతీష్కు పెళ్లి అయింది, ఓ కుమారుడు కూడా ఉన్నాడు. వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా బత్కులాపురం గ్రామానికి చెందినవాడు. అతనికి పెళ్లి కాలేదు. ఈ ఇద్దరు కూడా హైదరాబాదుకు వచ్చిన చిన్న చిన్న సంస్థల్లో ఆఫీస్ బాయ్లుగా చేసి, చివరకు కారు డ్రైవర్లుగా స్థిరపడ్డారు.