నేను రాయలసీమ బిడ్డనే, బుల్లెట్లా దూసుకెళ్తా, నాతో పెట్టుకోవద్దు: చంద్రబాబు
హైదరాబాద్: రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నూలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సోమవారం ఆ విమర్శలపై స్పందించారు. తాను రాయలసీమకు చెందినవాడిని కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
రాయలసీమ వెనకబాటుకు స్థానిక నేతలే కారణమని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని కొందరు బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కంఠంలో ప్రాణం ఉండగా రాయలసీమకు అన్యాయం జరగనివ్వనని అన్నారు.

రాయలసీమను అభివృద్ధి చేసే వరకు విశ్రమించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను రాయలసీమ బిడ్డనేనని, ఇక్కడే పుట్టి పెరిగానని ఆయన అన్నారు. అభివృద్దికి ఎవరైనా అడ్డుపడితే బుల్లెట్లా దూసుకెళ్తానని ఆయన చెప్పారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు గానీ తనతో పెట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. అనవసర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు వారి హయాంలో ప్రజలకు ఏం చేశాయో చెప్పాలని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
తప్పులుంటే సరిచేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటే తాను ఇక్కడే మకాం చేస్తానని, అవసరమైతే బస్సులో పడుకుని ఇక్కడే తిష్ట వేస్తానని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి 125 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కర్నూలులో 900 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల నుంచి ఇమామ్లకు రూ. 5 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications