క్యారెక్టర్పై బురద.. నా బాధ ఎవరికి చెప్పాలి, నాశనమౌతావ్: బాబుపై రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత తననే టార్గెట్ చేశారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా జరగని ఘోరాలు చంద్రబాబు ఉంటున్న బెజవాడలోనే జరుగుతున్నా చర్యలు ఏవని ప్రశ్నించారు.
ఆడవాళ్లు అబలలు అని చంద్రబాబు భావిస్తే తప్పన్నారు. నీ వెన్నుపోటు రాజకీయాలు నా పైన ప్రయోగిస్తానంటే నీ అంతు చూసే దాకా నేను వదలనన్నారు. తప్పు చేయకున్నా అధికార బలంతో ఆడవారిని తొక్కేయాలనుకుంటే వారి ఉసురు తగిలి నాశనం అవుతారని రోజా.. చంద్రబాబుపై మండిపడ్డారు.
మంత్రులు రావెల కిషోర్ బాబు వంటి వారు ఇష్టారీతిగా మాట్లాడారన్నారు. అప్పుడేం చేశారన్నారు. మీరు చంపేస్తారా? అని రోజా ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుందని, గిరిజనులకు అండగా నిలబడితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను జీవిత ఖైదు చేయాలా అన్నారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారికి జీవిత ఖైదు లేదా వారి క్యారెక్టర్ పైన బురద జల్లుతారా అని ప్రశ్నించారు. పనికి మాలిన వారిని జన్మభూమి కమిటీలో వేశావన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు తన పైన బురద జల్లుతున్నారన్నారు.
దేశంలో ఎక్కడా జరగనన్ని అఘాయిత్యాలు ఏపీలో జరుగుతున్నాయని, ఇలా దేశంలో ఎక్కడా జరగగడం లేదన్నారు. సాక్షాత్తు చంద్రబాబు నివాసం ఉన్న విజయవాడలోనే దారుణాలు జరుగుతున్నాయన్నారు. మహిళల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు.
అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు విజయవాడలోనే కూర్చున్నారని, అందుకే దానికి కారకులు టిడిపి కార్యకర్తలే అన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సిగ్గుపడాలని ఏకిపారేశారు. మీరు పాలకులా లేక కాలకేయులా అని ధ్వజమెత్తారు.
గతంలో రేవంత్ రెడ్డి సస్పెన్షన్ అయినప్పుడు అసెంబ్లీలోనే తిరిగారని, మొన్న మా పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో తిరిగారని, కానీ తననే అసెంబ్లీలోకి రాకుండా ఎందుకు అడ్డుకున్నారన్నారు. ఎవరికి లేని ఆంక్షలు రోజాకేనా అని ప్రశ్నించారు.
నా బాధలు ఎవరికి చెప్పాలన్నారు. నా బాధలు సభాపతికి చెప్పుకునేందుకు హక్కు లేదా అన్నారు. ఇందుకు చంద్రబాబుకు, ఆయన పార్టీలోని మహిళా మంత్రులకు ఉండాలన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు తన పైన ఇష్టారీతిగా మాట్లాడటం విడ్డూరమన్నారు. తనను భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారన్నారు.
ఏ పార్టీ వాళ్లు గతంలో సభలో దారుణంగా ప్రవర్తించారో క్లిప్పింగులు చూస్తే అర్థమవుతోందన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ వద్ద పదవి లాక్కొని ఆయననే ఏడిపించాడంటే టిడిపి వారు ఎంతటి రాక్షసులో అర్థమవుతోందని రోజా ధ్వజమెత్తారు.
అందరూ చెబుతుంటే ఏమో అనుకున్నాను కానీ... ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి నుంచే పదవి లాక్కొని ఆయననే చంద్రబాబు ఏడిపించారన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కింద ఉన్న చంద్రబాబు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అభిప్రాయపడ్డారు.
గతంలో రాష్ట్రమంతా చంద్రబాబు పైన దుమ్మెత్తి పోస్తుంటే పీతల సుజాతను అడ్డు పెట్టుకున్నారని, ఇప్పుడు మరో మహిళా ఎమ్మెల్యే (అనిత)ను అడ్డు పెట్టుకున్నారన్నారు. ఆ ఎమ్మెల్యేలకు చీము నెత్తురూ లేదా అని మండిపడ్డారు.