భయమంటే ఏంటో తెలియదు, ఆయనే నవ్వులపాలయ్యారు: చంద్రబాబు
అమరావతి: 'భయమంటే ఏమిటో నాకు తెలియదు. ప్రజలకు తప్ప ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు' అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం కోసం సంయమనంతో వ్యవహరిస్తున్నానని పేర్కొన్నారు.
అందుకే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నానని, ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే కారణం లేదని అన్నారు. రాష్ట్ర పసికందుతో సమానమని అన్నారు. టీడీపీకి ప్రధానులు కొత్త కాదని, కేంద్ర ప్రభుత్వాలూ కొత్త కావని చెప్పారు.
'వీపీ సింగ్ను ప్రధానిని చేశాం. వాజ్పేయితో కలిసి పనిచేశాం. రాష్ట్రపతుల నియామకాల్లో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించాం. ఇదీ తెలుగుదేశం ఘనత' అని ఆయన అన్నారు. తాను కేసులకు భయపడుతున్నానని ఎవరో చెప్పుకొంటున్నట్లు పవన్ కల్యాణ్ అన్నారని, నిప్పులా బతికానని చెప్పారు.
తాను ఏ తప్పూ చేయలేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి నాపై 23 కేసులు పెట్టారని అందులో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. చివరకు ఆయనే నవ్వులపాలయ్యారని అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు తప్పు చేయనని అన్నారు.

తాను ఎవరికైనా భయపడతానంటే అది ప్రజలకు మాత్రమేనని అన్నారు. తనకు ఎవరూ హై కమాండ్ లేరుని, ప్రజలే నా హై కమాండ్ అని అన్నారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని చెప్పిన చంద్రబాబు, సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా ఇటలీ రిపబ్లిక్ డే రోజు ఏపీకి విడగొట్టిందని మండిపడ్డారు.
కట్టుబట్టలతో బయటకు వచ్చామని, అప్పుల్లో ఉన్నామని, ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఎన్నో సార్లు కేంద్ర పెద్దల్ని కలిశానని, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని కోరానని అన్నారు. ఇప్పటి వరకు 23 సార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రధాని మోడీని కలిసి వినతిపత్రం సమర్పించానని చెప్పారు.
కేంద్రం నుంచి కొన్ని సాధించామని, మరికొన్ని సాధించుకోవాల్సి ఉందని అన్నారు. ఏపీకి హోదా సాధించే వరకూ పోరాడుతూనే ఉంటామని, విభజన చట్టంలోని హామీలను కూడా కేంద్రం నెరవేర్చాలని అన్నారు. పోలవరం నిర్మించి ఇవ్వాలని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, పరిశ్రమలకు రాయితీలు ఇలా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు.
ఏ నాయకులు ఏమనుకున్నా తనకు భయం లేదని ఆయన తెలిపారు. ప్రజలు నన్ను నమ్మితే చాలని, ఆ నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోందని చెప్పారు. తాను సక్రమంగా పనిచేస్తున్నానని మీరంతా దీవిస్తున్నారని అన్నారు.
ఈ బలం నాకు చాలని, తెలుగు జాతి గర్వపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తానని, ఇందుకోసం ప్రజల సహకారం నాకు కావాలని అన్నారు. కొంత మంది రాజకీయాలు చేయడానికే ప్రజల్లోకి వస్తారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి శ్రమించే తెలుగుదేశం పార్టీకి అందరూ అండగా నిలవాలని ప్రజలను కోరారు.
వైసీపీది లాలూచీ రాజకీయమని చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు తమ కేసుల మీద తప్ప మరే అంశంపైనా ధ్యాస లేదన్నారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండడమే దురదృష్టకరమని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.
పార్లమెంటులో నిలబడి పోరాడాల్సింది పోయి వాకౌట్ల వంచన చేశారని, నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ప్రత్యేక హోదాపై మాట్లాడడం సంతోషమేనన్నారు. కానీ ఆయన వైసీపీ, కాంగ్రెస్ నాయకుల్లా మాట్లాడడం సరికాదన్నారు. సీబీఐకి తాను భయపడుతున్నానని ఆయన అనడం ఒప్పుకోనని చెప్పారు.












Click it and Unblock the Notifications