టిటిడిఎల్పీగా ఎర్రబెల్లి, పదవులొద్దని తలసాని అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావును తెలంగాణ అసెంబ్లీ శాసనసభాపక్షం నాయకునిగా, ఉపనేతలుగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ను, రేవంత్ రెడ్డిని నియమించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అసెంబ్లీలో పార్టీ విప్గా, కౌన్సిల్లో ఎ నర్సారెడ్డిని పార్టీ పక్షం నాయకునిగా నియమించారు. వీటిని పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కోశాధికారిగా మాగంటి గోపినాథ్, కార్యదర్శులుగా సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారని తెలుస్తోంది. టిటిడిఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై శనివారం రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం ఎర్రబెల్లి, తలసాని, ఆర్ కృష్ణయ్యల పేర్లు చివరి దాకా పరిశీలనలోకి వచ్చాయి.

అయితే, సీనియారిటీని పరిగణలోకి తీసుకొని తమకే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి, తలసానిలు పట్టుబట్టారు. చివరకు ఎర్రబెల్లిని శాసన సభా పక్ష నేతగా ఎంపికయ్యారు. తొలుత చైర్మన్గా ఎర్రబెల్లి, శాసన సభా పక్ష నేతగా తలసానిలను ఎంపిక చేసినట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి.
తలసాని అసంతృప్తి
గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శాసనసభాపక్షం నాయకుని పదవిని ఆశించారు. తనను ఉప నాయకునిగా నియమించి ఎర్రబెల్లికి ఆ పదవి కట్టబెట్టారని తెలుసుకున్న తలసాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు ఏ పదవి వద్దని, ఎమ్మెల్యేగానే ఉంటానని తలసాని తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications