మహిళలకు న్యాయం చేయాలి.. జగనన్నని ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నా: రోజా
తాను జగన్ అన్నని ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నానని, అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలపై మహిళలకు న్యాయం చేయాలని, అలాగే మహిళల జీవితాలను రోడ్డున పడేస్తోన్న మద్యాన్ని అరికట్టేలా చేస్తానని
అమరావతి: తాను జగన్ అన్నని ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నానని, అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలపై మహిళలకు న్యాయం చేయాలని, అలాగే మహిళల జీవితాలను రోడ్డున పడేస్తోన్న మద్యాన్ని అరికట్టేలా చేస్తానని ఓ ప్రకటన చేయాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు.
గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న ప్లీనరీలో శనివారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనపై రోజా నిప్పులు చెరిగారు. డ్వాక్రా రుణాలపై వడ్డీ రూ.10 వేల కోట్లకు చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సొంత చెల్లెళ్ల మాదిరిగా...
రాష్ట్రంలోని ప్రజలందరూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓ అన్నగా భావించారని రోజా అన్నారు. సొంత అన్న ముఖ్యమంత్రి అయితే తన చెల్లెళ్లని ఎలా చూసుకుంటారో వైఎస్సార్ రాష్ట్రంలోని మహిళలను అలా చూసుకున్నారని వ్యాఖ్యానించారు. మహిళలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలను ఇచ్చారని, వారిని ముందుకు నడిపించారని పేర్కొన్నారు.
Recommended Video
శ్మశానానికి ముగ్గు ఉండదు...
డ్వాక్రా వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు ఇస్తామని మహిళలను ఆయన మోసం చేశారని, శ్మశానానికి ముగ్గు ఉండదు.. చంద్రబాబునాయుడికి సిగ్గు ఉండదంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బజారుకో మద్యం దుకాణంతో మహిళలు రోడ్డు పాలు...
అంతేకాదు, చంద్రబాబు నాయుడు కొత్తగా 85 బార్లకు లైసెన్సులు ఇచ్చారని, మద్యాన్ని యథేచ్ఛగా అమ్ముకునేలా చేస్తూ మహిళల జీవితాలని రోడ్డున పడేలా చేస్తున్నారని విమర్శించారు. బజారుకో బీరు షాపు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఆడ వాళ్ల కన్నీళ్లలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
జగనన్న న్యాయం చేయాలి...
ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. పట్టపగలు కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. మహిళలపై 11 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని రాష్ట్ర డీజీపీనే చెప్పారని అన్నారు. చంద్రబాబు నాయుడి మోసాలను, కుట్రలను అరికట్టి మహిళలకు జగన్ అన్న న్యాయం చేయాలని ఆమె కోరారు.