ముఖంపై పిడిగుద్దులు గుద్దారు: ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేశా: అందుకే కుట్రంటూ పృథ్వీ
హైదరాబాద్: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రముఖ హాస్య నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను ఎస్బీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని విచారణ కమిటీ తేల్చిన తర్వాతే తాను తిరిగి ఆ పదవి చేపడతానని అన్నారు.
నా గొంతు మార్ఫ్ చేశారు: మేకప్ మెన్ ఇష్యూనే...: రాజీనామాపై పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు
కుట్ర ముందే ఊహించా..
తాను ఎస్వీబీసీకి సంబంధించిన ఒక్క రూపాయి తిని ఉంటే తాను రేపే నాశానమవుతాయని పృథ్వీ అన్నారు. తనపై కుట్ర జరుగుతుందని ముందే ఊహించానని అన్నారు. తనపై కుట్ర చేసిన ప్రతిపక్షాలకు సెల్యూట్ అని చెప్పారు.
తాను ఏ తప్పు చేయలేదని ఆయన అన్నారు. ఎస్వీబీసీకి మంచి పేరు తేవాలనే చూశానని అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని కూడా తప్పుబట్టానని చెప్పారు.
ముఖంపై పిడిగుద్దులు గుద్దారు
జనవరి 10న ఉదయం క్రికెట్ గ్రౌండ్కు వెళుతున్న సమయంలో ఎవరో దుండగులు తనపై దాడి చేశారని, ముఖంపై పిడిగద్దులు గుద్ది పారిపోయారని పృథ్వీ చెప్పారు. తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నారు. వెంకటకృష్ణగారు తెలంగాణ నుంచి ఏమేం చేశారో తెలుసుని అన్నారు మీకు అమరావతిలో 9 ఎకరాలున్నాయి.. నాగలి తిరగేసి కొడతారా? మీకు ఇంత కడుపుమంటా? అని పృథ్వీ వ్యాఖ్యానించారు.
సీఎం జగన్కు దగ్గరవుతున్నానే..
తన వ్యాఖ్యలపై పోసాని ఎందుకు రియాక్టరయ్యారో తెలియదని పృథ్వీ అన్నారు. తన పనిచూసే జగన్ ఎస్వీబీసీ పదవిని ఇచ్చారని చెప్పారు. 1989లోనే తాను సినీరంగంలోకి వచ్చానని, అప్పుడు వైఎస్ ఆశీర్వదించారని.. అప్పటి నుంచే తాను ఆయనతో అనుబంధం ఉందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయికి తాను దగ్గరవుతున్నాననే తనపై కుట్రలు చేశారని పృథ్వీ ఆరోపించారు. తనపై తీవ్ర విమర్శలు చేస్తూ ఫోన్లు చేస్తూ, కార్డులు రాస్తున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. అశ్వనీదత్ కూడా తనను యెధవ అని అన్నారని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
పోసాని మంచి మిత్రుడు.. విడగొట్టారు..
తాను అసలైన రైతులకు క్షమాపణ చెబుతున్నానని పృథ్వీ తెలిపారు. రైతులందరినీ తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని చెప్పారు. కార్పొరేట్ రైతులను మాత్రమే అన్నానని తెలిపారు. పోసాని తనకు మంచి మిత్రుడని, చదువుకునే రోజుల్లో తన సీనియర్ అని పృథ్వీ చెప్పారు. తమ ఇద్దరి మధ్య గొడవలు పెట్టారని, సామాజిక వర్గాలుగా విడగొట్టారని అన్నారు. తాను ఇప్పటికే పోసానిని అభిమానిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.
అప్పుడే తిరిగొస్తా..
తనపై వచ్చిన ఆరోపణలతో ఎస్వీబీసీలో విచారణ వేయమని తానే చెప్పానని పృథ్వీ తెలిపారు. సీఎం జగన్ చెప్పినట్లుగా తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా నడుచుకుంటున్నానని తెలిపారు. తప్పుంటే చెప్పుతో కొట్టించుకుంటానని ఆయన అన్నారు. విచారణ చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కోరినట్లు తెలిపారు. ఎంక్వైరీ తేలాకే తాను తిరిగి ఎస్వీబీసికి తిరిగి వస్తానని అన్నారు. అందుకే ఇప్పుడు రాజీనామా చేశానని, రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేశానని చెప్పారు. తాను ఎస్వీబీసీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, భోజనం కూడా తన ఖర్చులతోనే చేస్తున్నానని చెప్పుకొచ్చారు.