మోసం చేయకుండా సిఎంనౌతా, ప్రతింట్లో నాఫోటో: జగన్
విశాఖ: తాను పదవి కోసం ప్రజలను మోసం చేయలేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. ఆయన ఓటమి పైన ఆయా నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి పార్లమెంటు పరిధి నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రతి ఇంట్లోనూ నాన్న ఫోటోతో పాటు తనదీ ఉండాలన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని గుర్తుంచుకున్నట్లే ప్రజలంతా తనను కూడా ఆదరించి, గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కావాలని అందరికీ ఉంటుందని అయితే, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కాదలుచుకోలేదన్నారు.
పదవి కోసం గడ్డితినే అలవాటు తనకు లేదన్నారు. మోసం చేసి పదవుల్లో ఉంటే ప్రజలు హర్షించరన్నారు. ముఖ్యమంత్రిగా నిజాయతీతో సుపరిపాలన సాగించాలన్నారు. అబద్దాలు చెప్పకుండా, మోసం చేయకుండా తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. అబద్దాలు చెప్పి, మోసం చేసి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్తే మనం ప్రజలకు న్యాయం చేసిన వారమెలా అవుతామన్నారు.
మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందని, పాత రుణాలు కడితేనే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు చెప్పినప్పుడు ప్రతి రైతు ఎంత బాధపడతారో తెలుసునన్నారు. పదవి కోసం అమలుకానీ హామీలు ఇచ్చి, నెరవేర్చనప్పుడు ప్రజలే నిలదీస్తారన్నారు. అప్పుడు వారికేం సమాధానం చెబుతామన్నారు.