పురుష కమిషన్ పై మాటకు కట్టుబడి ఉన్నా...నేను,సిఎం ఆపగలమా? :నన్నపనేని రాజకుమారి
తిరుపతి:ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
మానవత్వంలో మార్పు వస్తే తప్ప మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగవని నన్నపనేని రాజకుమారి ఈ సందర్భంగా చెప్పారు. కేవలం ముఖ్యమంత్రి...తాను అనుకున్నంత మాత్రాన హత్యలు, అత్యాచారాలను ఆపగలమా...

చట్టాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న తన సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంపై నన్నపనేని స్పందించారు. తాను అదే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు.
తాను ప్రతిపాదించిన పురుష కమిషన్ కు ఎవరూ అడ్డుచెప్పలేదన్నారు. పైగా అందరూ స్వాగతించినట్లు నన్నపనేని చెప్పారు.
తిరుపతి పర్యటన సందర్భంగా ఆమె ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. బాలింతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి వసతి సదుపాయాలు పరిశీలించారు. ఇక్కడ వసతులు బాగున్నాయన్నారు.
అయితే పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నన్నపనేని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించడంతో పాటు ఏకంగా ఆమె తన పదవికి రాజీనామా చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications