హైదరాబాద్ ఐటీ కేంద్రం, ఘనత నాదే: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ఏర్పడి 15ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ భవిష్యత్ గురించి సవివరంగా తెలిపి, మైక్రోసాఫ్ట్ కంపెనీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని వారిని కోరామని తెలిపారు. తాము కోరాం కాబట్టే మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని చంద్రబాబు తెలిపారు.
మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కిడికి వచ్చాయని ఆయన చెప్పారు. నగరంలో హైటెక్ సిటీ ఏర్పాటుతో ఎన్నో మార్పులు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. యువత కోసమే అభివృద్ధి చేశామని, ప్రస్తుతం యువతను ఈ రంగంలో ఉన్నతంగా చూస్తుంటే తనకు సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు.
ఒకప్పుడు కొండలతో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రదేశంగా మార్చామని తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. దీంతో ఎంతో మంది గ్రామీణ యువత ఉపాధి పొందుతోందని ఆయన తెలిపారు. ఒక మంచి పని చేసినందుకు ఆనందంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఇదంతా తన ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన అన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు యువత ముందుకు రావాలని, యువత దూరదృష్టిని కలిగి ఉండాలని చంద్రబాబు యువతకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పథంలో సాగుతున్న యువతకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఐటీ ఉద్యోగులతో సమావేశమైన తర్వాత... మళ్లీ వచ్చి మీడియాతో మాట్లాడతానని చెప్పి చంద్రబాబు వెళ్లి పోయారు.