కిరణ్పై పొన్నం ఫైర్: ఏం చెప్పారో తెలియదన్న బొత్స
కరీంనగర్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. సమైక్యవాది అయిన కిరణ్ ఫోటోను దిష్టిబొమ్మలా తాము రచ్చబండ కార్యక్రమంలో పెట్టుకుంటామన్నారు.
తెలంగాణలో రచ్చబండకు ముఖ్యమంత్రి రావొద్దని చెబుతున్నా ఆయన వస్తాననడం హాస్యాస్పదమన్నారు. కిరణ్ను నిజంగా ఏమాత్రం నైతికత ఉన్నా రచ్చబండకు రారన్నారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం తర్వాత అధికార దుర్వినియోగం జరిగిందని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులతో కలిసి తాము జవోఎంకు మరో నివేదిక ఇస్తామన్నారు.
ఏం నివేదిక ఇచ్చారో తెలియదు: బొత్స
కాంగ్రెస్ పార్టీ తరఫున జివోఎం సమావేశానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వట్టి వసంత్ కుమార్లు హాజరవుతారని, వారు ఏం నివేదిక ఇస్తారో తనకు తెలియదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వారిద్దరూ ప్రాంతాల వారిగా ఉన్న సమస్యలను జివోఎంకు వివరిస్తారని అన్నారు.
జివోఎంతో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో బొత్స భేటీ అయ్యారు. ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. జివోఎం సమావేశానికి వెళ్లే కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో బొత్స లేరు. కానీ షిండేతో 20 నిమిషాలపాటు భేటి కావడం మీడియాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి జివోఎం సమావేశానికి కాంగ్రెస్ తరపున వట్టి, దామోదరలు ఉన్నారు.
ఒప్పుకోం: కెటిఆర్
హైదరాబాదు పైన కేంద్రం ఎలాంటి ఆంక్షలు పెట్టినా తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదని తెరాస ఎమ్మెల్యే కెటిఆర్ ఢిల్లీలో వేరుగా అన్నారు. జివోఎంతో తెరాస నేతల భేటీకి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చివరి సమయంలో విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకే అన్ని పార్టీలతో జివోఎం సమావేశమౌతోందన్నారు. హైదరాబాదు పైన సర్వాధికారాలు తమకే ఉండాలన్నారు.