కెసిఆర్, విజయశాంతి నుంచి ప్రాణహాని: లాయర్ బాలాజీ
హైదరాబాద్: తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలని కోరుతూ న్యాయవాది బాలాజీ వడేరా డిజిపి ప్రసాదరావును సోమవారం కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు, ఆ పార్టీ నేత హరీశ్ రావు, కాంగ్రెస్ నేత విజయశాంతి ఆస్తులపై విచారణ జరిపించాలని న్యాయవాది బాలాజీ వడేరా ఇటీవల సిబిఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కెసిఆర్, హరీశ్ రావు, విజయశాంతి వర్గీయుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సోమవారం ఆయన డిజిపి ప్రసాదరావును కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేయాలని డిజిపి ప్రసాద్ రావు.. వడేరాకు సూచించారు.

దీంతో న్యాయవాది వడేరా హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాలాజీ వడేరా మాట్లాడుతూ.. కెసిఆర్ వర్గీయుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. కెసిఆర్, హరీశ్ రావు, విజయశాంతి ఆస్తులపై విచారణ జరిపించాలని సిబిఐ కోర్టు ఆదేశించిన నాటి నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని వడేరా తెలిపారు.
ఇదే విషయాన్ని డిజిపి, కమిషనర్కు ఫిర్యాదు చేశానని బాలాజీ వడేరా చెప్పారు. అలాగే తనకు, తన కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా.. తమ ఆస్తులపై విచారణ జరుపుకోవచ్చని, తాము సిద్ధంగా ఉన్నామని, భయపడేది లేదని కెసిఆర్, హరీశ్ రావు, విజయశాంతిలు ఇప్పటికే ప్రకటించారు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని కెసిఆర్
ఆరోపించారు.












Click it and Unblock the Notifications