తుఫాన్ తీవ్రరూపం దాల్చుతున్నా ఈసీ స్పందించదా ..? కోడ్ ఎత్తేయ్యండి.. సమీక్షలకు చాన్సివ్వండి : చంద్రబా
అమరావతి: ఫోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు. ఆయా ప్రాంతాల్లో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వెంటనే ఎత్తేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు చెప్పారు. గతంలో విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుఫాన్ అల్లకల్లోలం చేసిందని, ఆ సమయంలో తాను దాన్ని ధీటుగా ఎదుర్కొన్నానని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు.
ఎల్ వీ నిరంతర సమీక్ష..
ఫొని తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఆయా జిల్లాల పాలన యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఫొని తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున.. వెలగపూడిలోని సచివాలయంలో ఎల్ వీ సుబ్రహ్మణ్యం నిరంతరాయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నారు.
ఆర్టీజీఎస్ తుఫాన్ కదలికలు..
ఈ నేపథ్యంలో- చంద్రబాబు ఉండవల్లిలోని ప్రజా వేదిక వద్ద సమీక్ష చేపట్టారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అనేక తుఫాన్లను ఎదుర్కొన్న అనుభవం తనకు ఉందని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికలను తాను పసిగడుతున్నానని అన్నారు. వాతావరణ శాఖ కంటే మెరుగైన, నిక్కచ్చి సమాచారాన్ని ఆర్టీజీఎస్ అందిస్తోందని ఆయన చెప్పారు.
కోడ్ ఎత్తేసిన వెంటనే..
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి తాను సన్నహాలు చేస్తున్నానని అన్నారు. దీనికి ఎన్నికల సంఘం అనుమతులు అవసరమయ్యాయని చంద్రబాబు వెల్లడించారు. అనుమతి కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశానని చెప్పారు. గురువారం ఉదయంలోగా అనుమతి లభించే అవకాశం ఉందని, ఆ వెంటనే తాను తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్తానని పేర్కొన్నారు. ఒడిశా తరహాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల కోడ్ ను ఎత్తేయాలని ఆయన ఎన్నికల కమిషన్ కు డిమాండ్ చేశారు.
హుద్ హుద్ ను ఎదుర్కొన్నది నేను కాదా?
ఒడిశాలో తుఫాన్ బారిన పడుతున్నట్లుగా భావిస్తోన్న 11 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో హుద్ హుద్, ఆ తరువాత తిత్లీ వంటి తుఫాన్ లను సమర్థవంతంగా తాను ఎదుర్కొన్నానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ అనుభవంతో ఫొని తుఫాన్ ను కూడా ఎదుర్కొంటానని చెప్పారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో తానే లేకపోయి ఉంటే పెద్ద ఎత్తున అనర్థాలు చోటు చేసుకుని ఉండేవని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తిత్లీని కూడా ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు.