అంతా కొత్తవాళ్లే అంటే పార్టీ కష్టం!: టిక్కెట్లు ఎవరికి ఎన్ని ఇస్తానో చెప్పిన పవన్ కళ్యాణ్
అమరావతి/కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేనాని జిల్లాల నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జనసైనికులకు దిశానిర్దేశనం చేస్తున్నారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాస్థాయి నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంగళవారం కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. 9, 10 తేదీల్లో మిగిలిన జిల్లాలైన గుంటూరు, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో భేటీ కానున్నారు.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: కాంగ్రెస్ దోస్తీ బాబుకు దెబ్బ, లోకసభ ఎన్నికల్లో జగన్దే హవా!
నా శక్తి, వీక్నెస్ తెలుసు
కర్నూలు జిల్లా భేటీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని పేర్కొన్నారు. రాజకీయాల పట్ల యువత ఉత్సాహంగా ఉందని, కానీ దాంతో పాటు వ్యూహాలు కలిగి ఉండాలని చెప్పారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చాలనుకునే యువతను అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తామని చెప్పారు. మనలోని శక్తిని సమాజం కోసం ఉపయోగించాలని, సమాజంలోని మంచి కోసం ఉపయోగించాలన్నారు. నా శక్తి ఏమిటో, నా వీక్నెస్ ఏమిటో నాకు బాగా తెలుసునని చెప్పారు.
ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు, 2001 నుంచి గమనించా
తాను 2001 నుంచి చూస్తున్నానని ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను 2003 నుంచే పూర్తిస్థాయి రాజకీయాలకు సిద్ధమయ్యానని చెప్పారు. ప్రజలు ప్రస్తుత నేటి రాజకీయాలతో విసిగిపోయారని చెప్పారు. ఇప్పుడు ప్రజలు మనవైపు చూస్తున్నారని చెప్పారు. నాయకుడు అంటే ప్రజల గురించి ఆలోచించాలని చెప్పారు. కానీ మన నేతలు యువత కోసం, ప్రజల కోసం ఆలోచించడం లేదని చెప్పారు.
టిక్కెట్లు ఎవరికి ఇస్తానో చెప్పిన పవన్ కళ్యాణ్
ఈ సార్వత్రిక ఎన్నికల్లో 60 శాతం కొత్త వారికి, 20 శాతం భావజాలం ఉన్న వారికి, 20 శాతం విలువలు ఉన్న వారికి టిక్కెట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సంక్రాంతి లోపు స్వల్పకాలిక కమిటీలు వేస్తామని చెప్పారు. కుటుంబాల మధ్య కర్నూలు నలిగిపోతోందన్నారు. యువత ఎదగాలనుకున్న రాజకీయ శక్తులు ఎదగనివ్వవని అన్నారు.
అంతా కొత్తవాళ్లే అంటే.. ఆసక్తికర వ్యాఖ్యలు
అందరూ కొత్తవాళ్లే అంటే పార్టీ (జనసేన) నిలబడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి పార్టీకి సీనియర్లు కూడా కావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలో తనకు స్పష్టత ఉందని చెప్పారు. కొత్తవారితో కసి ఉంటుందని, కానీ వ్యూహం ఉండదని చెప్పారు. మనం ఏదో చేస్తామని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ప్రధాన సమస్యలపై ఆరా
కాగా, పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాల్లో పర్యటన సందర్భంగా స్థానిక సమస్యలపై జనసేనాని ప్రధానంగా దృష్టి సారించనున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీలను నియమించనున్నారు. నియామకాల కసరత్తు తుది దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ జిల్లా నేతలతో సమీక్ష సందర్భంగా ఆయా జిల్లాల్లోని ప్రధాన సమస్యలపై ఆరా తీస్తున్నారు.
విమర్శలు అలా వద్దు
ప్రతి ఒక్క జనసేన నేత, జనసైనికులు, కార్యకర్తలు ఇతరులను విమర్శించే సమయంలో వారి కులాలను, వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారు. సమస్యల ఆధారంగా విమర్శలు ఉండాలని చెబుతున్నారు. పార్టీ నియమావళికి అనుగుణంగా అందరూ ఉండాలని చెప్పారు. జిల్లాల పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల్లోని నేతల నుంచి మరిన్ని స్థానిక సమస్యలపై ఆరా తీయనున్నారు. అప్పుడు జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పనున్నారు.