జగన్ ఎఫెక్ట్!: సమైక్య రాష్ట్రంలో చెప్పా, కష్టం: హామీలపై బాబు సంచలనం
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీలపై గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఆయుధంగా మారాయి. అయితే, కష్టాలున్నా హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తానన్నారు.
తాను సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒకటి కాదని, చాలా హామీలు ఇచ్చానని చెప్పారు. అయితే, అవన్నీ తాను సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అని చెప్పారు. నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరని చెప్పారు. మీరు నన్ను నమ్మి ఓటేశారని, హామీలు నిలబెట్టుకుంటానని చెప్పారు.
రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు మారాయని చెప్పారు. అయినా హామీలను నెరవేర్చేందుకు తాను ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. తాను ఒకటి రెండు కాదని ఎన్నో హామీలు ఇచ్చానని చెప్పారు. అన్ని రాష్ట్రాల మాదిరిగా ఏపీ అభివృద్ధి చెందే వరకు రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలన్నారు.
తూర్పు గోదావరి జిల్లా చేబ్రోలులో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పేదరిక నిర్మూలనే తన ధ్యేయమని చెప్పారు. పట్టిసీమ పూర్తయితే రాయలసీమ బాగుపడుతుందని చెప్పారు. కాకినాడ పోర్టును ఆధునికీకరిస్తామని చెప్పారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన పనికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం అయిందన్నారు. రాష్ట్రంలో పేదరికం ఉండేందుకు వీల్లేదన్నారు. పేదరికం మనల్ని చూసి భయపడాలన్నారు. రూ.10,500 కోట్లతో డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పొదుపు ఉద్యమాన్ని మొదలు పెట్టింది తానే అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన హామీలు, విడిపోయాక నెరవేర్చడం కష్టమని, నన్ను నమ్మి ఓటేశారని, వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
కాగా, హామీల పైన చంద్రబాబు వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊరట అని చెప్పవచ్చు. ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదంటూ జగన్ మంగళగిరిలో సమరదీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా హామీలపై నిలదీస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు హామీలపై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చంద్రబాబు హామీల పైన జగన్ బుధవారం నాడు ప్రజా బ్యాలెట్ విడుదల చేశారు.