కశ్మీర్ అంశంపై ప్రపంచానికి పాకిస్థాన్ విజ్ఞప్తి: భారత్పై తీవ్ర ఆరోపణలు!
జమ్మూకశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ పాలకులు మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి జమ్మూకశ్మీర్ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం.. కశ్మీర్ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజాన్ని పాక్ అధ్యక్షుడు, ప్రధాని సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా జులై 13న పాకిస్థాన్ అధికారికంగా నిర్వహించే 'కశ్మీర్ అమరవీరుల దినోత్సవం' జరుపుకుంటున్న తరుణంలో ఈ ఇద్దరు నాయకులు ఈ విజ్ఞప్తి చేశారు. వీరిద్దరూ భారత్ను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. దక్షిణాసియాలో శాంతి భద్రతలు నెలకొనాలంటే కశ్మీర్ సమస్య పరిష్కారం ఒక్కటే మార్గమని.. ఇందు కోసం ప్రపంచ దేశాలు ఇండియాపై ఒత్తిడి తీసుకోవాలని వారు కోరారు.
పాకిస్థాన్ తప్పుడు ప్రచారం
ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్థానీ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికే అన్నట్లు, పాకిస్థాన్ ప్రతి ఏడాది జులై 13న కాశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ ప్రజల పోరాటానికి తమ ప్రభుత్వం రాజకీయంగా, దౌత్యపరంగా, అలాగే నైతికంగా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలలో పొందుపరచబడిన కాశ్మీరీల స్వీయ-నిర్ణయాధికారాన్ని సాధించడానికి వారు చేస్తున్న న్యాయమైన పోరాటంలో వారికి పూర్తి సంఘీభావంతో నిలుస్తామని ఆయన మాట్లాడారు. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం ద్వారానే స్థిరత్వం సాధ్యమవుతుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడంపైనే దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం ఆధారపడి ఉన్నాయని ఆ ప్రకటనలో మరింతగా పేర్కొంటూ.. ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేసేలా భారతదేశంపై ఒత్తిడి తేవాలని అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది.
భారత్పై పాక్ అధ్యక్షుడి తీవ్ర ఆరోపణలు
మరోవైపు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడుతూ, "ఈ రోజు 95వ కాశ్మీర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, ఆ 22 మంది కాశ్మీరీ అమరవీరులకు నేను నివాళులర్పిస్తున్నాను" అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, "1931 నాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంలో పాకిస్తాన్ ప్రజలు తమ కాశ్మీరీ సోదరులతో చేతులు కలుపుతున్నారు" అని పేర్కొన్నారు. ఆ తర్వాత జర్దారీ భారతదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం ఉండటాన్ని ఖండించారు.
9 లక్షల మంది భారత సాయుధ దళాలు తమ ఆక్రమణను కొనసాగిస్తూనే కాశ్మీరీలను బందీలుగా పట్టుకున్నాయని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం పట్ల జర్దారీ తన అసంతృప్తిని కూడా తన ప్రకటనలో ప్రతిబింబించారు. కాశ్మీరీ ప్రజల గుర్తింపును లాగేసి, వారిని మైనారిటీగా మార్చే ప్రయత్నంగా ఆయన దీనిని అభివర్ణించారు.












Click it and Unblock the Notifications