వెంకయ్యపై వ్యాఖ్యలు: వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే యెన్నం
తెలంగాణ ఏర్పాటు అంశంపై వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై రెండు రోజుల క్రితం యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. షరతులు లేకుండా తెలంగాణ బిల్లుకు మద్దతు తెలుపుతామని బిజెపి మొదటి నుండి చెబుతోందని, వెంకయ్య వ్యాఖ్యలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కాగా సీనియర్ నాయకుడైన వెంకయ్య నాయుడుపై బహిరంగ విమర్శలు చేయడంతో బిజెపి అగ్రనాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివాదం సద్దుమణిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడికి వెంటనే శ్రీనివాస్ రెడ్డితో క్షమాపణలు చెప్పించాలని కిషన్ రెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది. క్షమాపణలు కోరకుంటే యెన్నంను పార్టీ నుంచి బహిష్కరించాలని కిషన్ రెడ్డికి అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
కాగా ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకున్న వెంకయ్య నాయుడు తనకు యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ కోసం చిత్తశుద్దితో పని చేసేలా యెన్నంకు సూచించాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలోనే వెంకయ్యనాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది.