టీటీడీ బోర్డు నిర్ణయాల్లో అది మాస్టర్ స్ట్రోక్- అలాంటి వాళ్లకు అదే సరైన మందు
TTD Chairman BR Naidu: కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు సారథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తీసుకున్న నిర్ణయాల పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ హర్షం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాలను స్వాగతిస్తోన్నామని తెలిపింది.
సోమవారం సమావేశమైన కొత్త పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లో దర్శనం కల్పించడం ఇందులో కీలకం. శ్రీనివాససేతు పేరును మళ్లీ గరుడ వారధిగా మార్చడం, అలిపిరిలో దేవలోకానికి కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది.

అలాగే- టీటీడీలో పని చేస్తోన్న అన్యమత ఉద్యోగుస్థలను సాగనంపాలనీ తీర్మానించింది బోర్డు. వారికి స్వచ్ఛంద పదవీ విరమణ కల్పించడం ఇతర ప్రభుత్వ శాఖల్లోకి సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. అలాగే- తిరుమలలో రాజకీయాలను మాట్లాడటంపైనా నిషేధం విధించింది. నిబంధనలను అతిక్రమిస్తే కేసులను పెట్టాలని పేర్కొంది.
స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని, శ్రీవాణి ట్రస్టు రద్దు చేసి టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్లోనే జమ చెయ్యాలని, ప్రైవేట్ బ్యాంకులోని డిపాజిట్లు ప్రభుత్వ బ్యాంకులకు బదలాయించాలనీ నిర్ణయించింది.
ఆయా నిర్ణయాలన్నింటినీ తాము స్వాగతిస్తోన్నామని బీజేపీ లోక్సభ సభ్యురాలు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా, సనతన సంప్రదాయాలను మరింత బలోపేతం చేసేలా బోర్డు నిర్ణయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
అన్నింటికీ మించి- టీటీడీలో పని చేస్తోన్న అన్యమత ఉద్యోగులను సాగనంపాలని నిర్ణయిండం గొప్ప విషయమని పురందేశ్వరి చెప్పారు. ఆలయ కమిటీలు, పాలక మండళ్లు, నామినేటెడ్ పదవుల్లో హైందవేతరులు ఉండకూడదనేది తమ అభిమతమని, దీనిపై చాలా కాలం నుంచి పోరాటం చేస్తూ వచ్చామని అన్నారు.
హిందూ ధర్మం గురించి తెలియని వాళ్లు, దాని గురించి అర్థం చేసుకోలేని వాళ్లకు అలాంటి పదవులు ఇవ్వడం వ్యర్థమని పురందేశ్వరి చెప్పారు. హిందూధర్మాన్ని గౌరవించని వాళ్లకు ఆలయాల్లో పదవులు ఇస్తే తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని ఆమె స్పష్టం చేశారు.
టీటీడీ సహా అన్ని ఆలయాల కమిటీలు, పాలక మండళ్లతో పాటు ఉద్యోగాల్లో అన్యమతస్తులు ఉండకూడదనే విషయం అయిదారు నెలల కిందటే తాము సంతకాల ఉద్యమాన్ని చేపట్టామని పురందేశ్వరి గుర్తు చేశారు. తమ ఆలోచనలకు టీటీడీ కొత్త పాలక మండలి కార్యరూపాన్ని ఇచ్చిందని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications