అన్నయ్య, నేను ఏం పీకుతారన్నారు, ఎవరు ఎవరితోనో ఉన్నారనేది న్యూసా?: పవన్ కళ్యాణ్
Recommended Video
పిఠాపురం: ప్రత్యేక హోదా పైన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు మాట మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు.
జాతీయ పార్టీలతో గొడవ పెట్టుకోవడం సులభం కాదని, నాడు కాంగ్రెస్కు జనసేన ఎదురు నిలిచిందని పవన్ చెప్పారు. నేను నా అన్నయ్యను, నా కుటుంబాన్ని, కాంగ్రెస్ని కాదని టీడీపీకి మద్దతిస్తే ఇప్పుడు చంద్రబాబు వారి కాళ్లే పట్టుకున్నారని విమర్శించారు. వద్దని ఎవరిని తరమి కొట్టామో వారి కాళ్లే పట్టుకుంటామని చెబుతున్నారని విమర్శించారు.
ఏం పీకుతారు.. ఏం పీకారు అనే మాటల నుంచి వచ్చా
2009లో ఏం పీకారు.. ఇప్పుడు ఏం పీకుతారు అనే మాటల మధ్య తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. చిరంజీవి, పవన్లు కలిసి ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేస్తే 2009లో గెలిచింది 18 సీట్లు మాత్రమేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దానిని పవన్ పరోక్షంగా గుర్తుచేశారు. ముఖ్యమంత్రి తన మీద చెత్త ప్రోగ్రామ్స్ చేయిస్తూ, మరోవైపు దోచుకుంటే ఎదురు తిరగకుండా ఎలా ఉంటామన్నారు. ఎవరో వ్యాపారవేత్తల మీద ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వద్దకు పోవడం తనకు బాధ కలిగించిందని పవన్ అన్నారు. కాంగ్రెస్ హఠావో అనే నినాదంపై తాను టీడీపీని గెలిపించానని చెప్పారు. హోదాపై చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారన్నారు. అవినీతికి పాల్పడితే చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను రోడ్ల పైకి లాక్కొస్తానని హెచ్చరించారు.
వాడుకొని వదిలేస్తాడని అందరూ చెప్పారు
చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచాడని, అలాంటి వ్యక్తికి మద్దతు ఎందుకిస్తున్నావని, నిన్ను వాడుకొని వదిలేస్తాడని అందరూ చెప్పారని పవన్ గుర్తు చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎన్టీఆర్ అంత మంచివాడిని కాదని, కాబట్టి ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే, ప్యాకేజీ అన్నారని గుర్తు చేశారు.
తెలంగాణలో మనమే తిరగగలం, తిడుతుంటే కేసీఆర్కు చెప్పా
తెలంగాణ ప్రభుత్వం బీసీలను ఓసిలుగా మార్చితే చంద్రబాబు, జగన్ మాట్లాడలేదన్నారు. మాట్లాడితే వారి ఆస్తులు, హెరిటేజ్ వ్యాపారాలు ధ్వంసం చేస్తారేమో, జగన్ గారి కాంట్రాక్టులు ఆగిపోతాయేమో అనే భయమని విమర్శించారు. తెలంగాణలో తిరగాలంటే జగన్, చంద్రబాబులకు భయమని, జనసేన మాత్రమే తిరగగలుగుతుందని, అందుకు మనం సత్యం మాట్లాడటమే కారణమని చెప్పారు. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు ఆంధ్ర ప్రజలను ఆంధ్రావారు అని విభజించి తిడుతుంటే నేను మాత్రమే తప్పు నాయకులదని కేసీఆర్కు, గద్దర్కు చెప్పానని అన్నారు. ఇన్ని కోట్ల మందికి ప్రాతినిథ్యం వహించే ఎంపీలని ఢిల్లీలో కొడుతుంటే వీళ్లకు సిగ్గు, లజ్జ, పౌరుషం లేదా అన్నారు.
జనసైనికులారా జాగ్రత్త.. ఆ రోజు ఏం చేస్తారో మీ ఇష్టం
జనసైనికులు చాలా జాగ్రత్తగా ఉండాలని, దాడులు జరిగే అవకాశం ఉందని, సంయమనం పాటించాలని, అవసరమైన రోజు నేనే చెప్తానని, ఆరోజు సైలెన్సర్ పీకుతారో ఏం పీకుతారో మీ ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను ఎంతో సంయమనం పాటిస్తానని, శాంతంగా ఉంటానని, తప్పుడు మాటలు మాట్లాడనని, కానీ మొన్న ఒక లఫుట్ అని అంటే ప్రైమ్ టైమ్ డిబేట్లు పెడతారా అని టీవీ ఛానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కంట్రోల్లో టీవీ చానెళ్లు అన్ని ఉన్నాయని, బాలకృష్ణ మనల్ని సంకరజాతి నా కొడుకులు అంటే డిబేట్ పెట్టరని, దెందులూరు ఎమ్మెల్యే మహిళను కొడితే డిబేట్ పెట్టరన్నారు.
ఎవరు ఎవరితో పడుకున్నారనేది న్యూసా?
ఎవరు ఎవరితో పడుకున్నారు అనేది న్యూసా.. అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని పవన్ ప్రశ్నించారు. మీరు వెళ్లి కేసులు పెట్టుకోండి.. అంతేకానీ ఎందుకు ఈ పనికిమాలిన వార్తలు అని పవన్ అన్నారు.