ఎన్నికల్లో ఓడినా.. మాట నిలబెట్టుకుంటా, మంచి పనికి పదవి అవసరంలేదు: నారా లోకేష్
అమరావతి: తాను ఎన్నికల్లో ఓడిపోయినా.. తానిచ్చిన మాటకు కట్టుబడే ఉంటాననని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రారంభోత్సవం సందర్భంగా నారా లోకేష్ ప్రసంగించారు. స్వర్ణకార కుటుంబసభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోయినా.. మాట నిలబెట్టుకుంటా
లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకోగలిగామని అన్నారు. సొసైటీ ఏర్పాటుకి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే స్వర్ణకారుల బంగారు భవిష్యత్తు కోసం ఒక మేనిఫెస్టో అమలు చేయాలనుకున్నట్లు లోకేష్ తెలిపారు. ఓడిపోయినా.. తానిచ్చిన మాటకు కట్టుబడే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ భాగం మాత్రమేనని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు, పని చేసే చోట సరైన సదుపాయాలు లేక ఆరోగ్య సమస్యలు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, అక్రమ కేసుల కారణంగా.. ఈ 9 నెలల కాలంలో స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవడం తనను చాలా బాధించిందని అన్నారు లోకేష్. పరామర్శకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబసభ్యులు చెప్పిన విషయాలు విన్న తరువాత బాధపడ్డానని తెలిపారు.

సంఘంగా సాధించుకోవచ్చు..
స్వర్ణకారులని అన్ని విధాలా ఆదుకోవడానికి మొదటి అడుగే సొసైటీ అని అన్నారు. ముందుగా సొసైటీ ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
మనిషిగా సాధించలేనిది సంఘంగా సాధించొచ్చనే ఆలోచనతోనే దీనికి ఈ రూపం వచ్చిందన్నారు లోకేష్. మన సొసైటీలో కులం, మతం, రాజకీయ పార్టీ అనే బేధాలుండవని అన్నారు. స్వర్ణకారుల సంక్షేమమే లక్ష్యంగా సొసైటీ పనిచేస్తుందన్నారు. సంఘంలో సభ్యులు అవడమంటే కుటుంబసభ్యులు కావడమేనని, మీ కోసం, మీరే నడిపించుకునే సంఘం అని స్వర్ణకారులను ఉద్దేశించి అన్నారు.

ఒక మంచి పనిచేయాలంటే ఏ పదవీ అవసరంలేదు..
సాయం కోసం ఎవరిపై ఆధారపడకుండా చూసేదే సహకార సంఘం. మీ ఆరోగ్య పరిరక్షణ సంఘ బాధ్యతగా వుంటుంది. మీ వృత్తికి సహాయం చేస్తుంది. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసానిస్తుంది. ఒక మంచి పని చేయాలంటే ఏ పదవీ అవసరం లేదు. లక్ష్మినరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ మీ బతుకులను బంగారుమయం చేస్తుందని చెప్పగలను. సభ్యులకు గోల్డ్ బిస్కెట్ లోన్ ఇప్పించేందుకు సంఘం కృషి చేయనుంది. గాలి, వెలుతురు లేని ఇరుకుగా ఉండే చోట్ల పనిచేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. సొసైటీ సహకారంతో పనిప్రదేశంలో పరిస్థితులు మెరుగుపడనున్నాయని లోకేష్ తెలిపారు.
Recommended Video


ప్రతీ స్వర్ణకారుడికీ మేలు చేసేలా..
ప్రమాదవశాత్తూ సంఘసభ్యుడు మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాదబీమా.. గాయపడితే రూ. 50 వేల ఆర్థిక సహాయం అందనుంది. ఏడాదికి ఒకసారి స్వర్ణకార కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు.
ప్రతీ ఆరునెలలకోసారి సభ్యులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
స్వర్ణకారులపై తప్పుడు కేసులకు రిటైర్డ్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం సొసైటీ అందించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ స్వర్ణకారుడికి అందేలా సొసైటీ చర్యలు తీసుకోనుంది. సొసైటీలో సభ్యులు 1000 మంది దాటితే సొసైటీయే నేరుగా స్వర్ణకారులకు గోల్డ్ బిస్కెట్లు లోన్లు అందించే అవకాశం కలుగుతుంది. నగల తయారీ కోసం మిషన్లను కొనుగోలు చేసేందుకు రుణ సదుపాయం కల్పించనుంది. సొసైటీలో 1500 మంది సభ్యులు దాటితే.. సభ్యుల పిల్లల చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వనున్నామని లోకేష్ వివరించారు.












Click it and Unblock the Notifications