జగన్ను కలుస్తా, 2019లో టీడీపీ ఔట్, కేసులు వేస్తా: విష్ణుకుమార్ రాజు సంచలనం
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నాక... తన మామగారి కోసం ఆయనను కలుస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
కేసులు వేస్తా
అంతేగాక, దమ్ముంటే కేసులు పెట్టాలంటూ కొందరు టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారని.. త్వరలోనే వారి కోరిక తీరుస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తేల్చి చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మే 15వ తేదీ తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఔట్
రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. రూ. 9,300 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని... కానీ, టీడీపీ ప్రభుత్వం తీసుకోవడం లేదని విష్ణు కుమార్ రాజు విమర్శించారు.
వైసీపీలోకి వలసలు
అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 15 తర్వాత టీడీపీ నుంచి వైయస్సార్ సీపీలోకి వలసలు ఉంటాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దీక్ష అయిపోయిందని, దాని వల్ల రాష్ట్ర ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు.
టీడీపీ పొత్తుతో నష్టపోయాం
రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు జరుగుతుందని కాదని..సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని..ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీతో పొత్తు కారణంగా చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏచూరికి పదవి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్తో కమ్యూనిస్టుల పోరాటమా..?
దోపిడీపై ఉద్యమిస్తామంటున్న కమ్యునిస్టు పార్టీలు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి పోరాటం చేస్తామనడంలో ఆంతర్యం ఏమిటని హరిబాబు ప్రశ్నించారు. దేశంలో అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతుందని, ముద్రా రుణాలు కోట్ల మంది ప్రజలకు ఇస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతోన్న ప్రధాని మోడీపై ఎలా విమర్శలు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఇరవైకి పైగా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేని సీపీఎం మోడీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. ఒక్కప్పుడు రెండో స్థానంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు అట్టడుగు స్థానానికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు.
ఒంటరిగానే ఎదుగుతాం
బీజేపీ ఒంటరిగా ఏపీలో బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని హరిబాబు వివరించారు. పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పలేదని, రాజకీయ పరిణామాల దృశ్యా మార్పులు చోటు చేసుకోవడం సహజమన్నారు. ఏపీలో అధికార, ప్రతిప్రక్షాలు తమపై విమర్శలు చేస్తుంటే తమ పార్టీ ఎంత ఎదిగిందో గమనించాలని తెలిపారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను...అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.