జగన్ పార్టీలోకి చేరుతున్నానా?: తేల్చేసిన సుబ్బరామిరెడ్డి
తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి తేల్చి చెప్పారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్టణం: తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి తేల్చి చెప్పారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కాగా, సెప్టెంబర్ 17వతేదీన తన పుట్టినరోజు సందర్బంగా సినీ నటి జమునకు సన్మానం చేయనున్నట్లు సుబ్బరామిరెడ్డి తెలిపారు.
బైరెడ్డి చేరికపై కేఈ కృష్ణమూర్తి
ప్రత్యేక రాయలసీమ నినాదంతో సొంత పార్టీ పెట్టుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి... ఉద్యమాన్ని ముగిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీ గూటికే చేరుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బైరెడ్డి టీడీపీలో చేరే అంశంపై స్పందించారు. టీడీపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. పెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరికీ స్వాగతం పలుకుతామని అన్నారు.
బైరెడ్డి ఇంతకు ముందు టీడీపీలోనే ఉన్నారని... ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని తమ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తే, తాము తప్పకుండా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి అనారోగ్య కారణాల వల్లే తాను హాజరుకాలేకపోయానని స్పష్టం చేశారు.