అలా జరిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా : చంద్రబాబు నాయుడు
రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేసేందుకు ఎంతవరకైనా పోరాడుతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ఒకవేళ ప్రజలు మళ్లీ వైసీపీనే గెలిపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కానీ వైసీపీ తప్ప ప్రజలంతా రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని చెప్పారు. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలో రాజధాని పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద చంద్రబాబు మాట్లాడారు.

రాజధానిగా అమరావతే సరైంది..
కేవలం మూడు కార్యాలయాలను తరలించినంత మాత్రాన విశాఖపట్నం అభివృద్ది జరగదని చంద్రబాబు అన్నారు. అమరావతి తరలింపు సునామీ వంటిదని.. దానికి సహకరించే పార్టీలన్నీ తుఫానులో కొట్టుకుపోవడం ఖాయమని మండిపడ్డారు. అమరావతి అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందని,రాజధానిగా అదే సరైన ప్రాంతం అని అభిప్రాయపడ్డారు. అమరావతి ఘనచరిత్రను కాపాడుకోవాల్సిన ప్రాధాన్యత ఉందన్నారు.

భోగి మంటల్లో కమిటీల నివేదికలు
అమరావతి నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత సహాయం చేశారని చంద్రబాబు అన్నారు. పరిపాలనకు అవసరమైన భవనాలన్నీ ఇప్పటికే నిర్మించబడ్డాయన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా రాజధానిని అమరావతిలోనే కొనసాగించవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా జీఎన్రావు,బోస్టన్ కమిటీ నివేదిక ప్రతులను భోగి మంటల్లో తగలబెట్టి నిరసన తెలిపారు.

రాజధానిని కాపాడుకుంటాం...
మూడు రాజధానులు అంటూ ప్రపంచంలో ఎక్కడా లేని విధానాన్ని అనుసరిస్తున్నారని వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ను చూసి నవ్వుకుంటోందని అన్నారు. మూడు రాజధానులు పిచ్చి ఆలోచన అని, అమరావతి పరిరక్షణ సమితిగా ఆధ్వర్యంలో రాజధానిని కాపాడుకుని తీరుతామని చెప్పారు.

మొదటిసారి సొంతూరుకు దూరంగా
సంక్రాంతి పండగకు అందరూ గ్రామాలకు వెళ్తారని, కానీ మొదటిసారి తమ సొంతూరు నారావారి పల్లెకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అమరావతి పోరాటం కోసం సంక్రాంతి పండగను జరుపుకోవడం లేదన్నారు. అమరావతి కోసం ఎంతవరకైనా పోరాడుతామని, మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అన్నారు. రాజధానిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications