రేపు మాట్లాడ్తా: టిపై కిరణ్, చిరు కోరిక తీర్చలేదు: సబ్బం
హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించేందుకు శుక్రవారం ఆసక్తి చూపలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపిన అంశంపై తాను రేపు పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో స్పందిస్తానని చెప్పారు.
అంతకుముందు కిరణ్ హైదరాబాదులోని రవీంధ్ర భారతిలో ఏర్పాటు చేసిన ఏడో విడత భూపంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతుకు భూమి హక్కు ఇస్తే సుస్థిరత సాధ్యమవుతుందన్నారు. పేదల భూములకు నీటి వసతిని కల్పించేందుకు రూ.1800 కోట్లతో ఇందిరా క్రాంతి పథకం అమలు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులు లేనిచోట రైతులకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నామి, తొమ్మిదేళ్లుగా తాము ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్లు చెప్పారు.

ఉచిత విద్యుత్ కోసం రూ.30వేల కోట్ల రాయితీ ఇచ్చామన్నారు. గోదావరి నుంచి ఐదువేల టిఎంసిల, కృష్ణా నది నుండి 500 టిఎంసీల నిరు వృథాగా పోతోందని, సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇందిర జలప్రభతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. వచ్చే ఏడాది 30 లక్షల ఎకరాలకు అందిస్తామన్నారు.
చిన్న కోరికలు తీర్చలేదు: సబ్బం
కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్లం రాజులు హైదరాబాదును యుటి చేయాలని చిన్న చిన్న కోరికలు కోరితే అధిష్టానం తీర్చలేకపోయిందని ఎంపి సబ్బం హరి ఢిల్లీలో అన్నారు. భద్రాచలం సీమాంధ్రదేనని, దానిని కూడా సీమాంధ్రలో కలపలేదన్నారు. పోలవరం ఇస్తామన్నప్పుడే తమకు అనుమానం వచ్చిందని, అసలు ఆ ప్రాజెక్టు రాదన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగకపోవడం వల్లనే తాము కేంద్రానికి మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications