కుప్పం వస్తే చంద్రబాబు కారుపై బాంబు వేస్తా: వైసీపీ నేత షాకింగ్ కామెంట్స్, ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా
చిత్తూరు: ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు ఆయన ఇంటిపైనా, టీడీపీ ఆఫీసుపైనా దాడులు చేసిన విషయం తెలిసిందే. పట్టాభిని పోలీసులు చేశారు. అయినా, అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది
చంద్రబాబు కారుపై బాంబు వేస్తానంటూ వైసీపీ నేత సంచలనం
తాజాగా, ఓ వైసీపీ నేత ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి జోలికొస్తే చంద్రబాబు నాయుడు కారుపై బాంబు వేస్తానంటూ వైసీపీ నేత, గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(రెస్కో) ఛైర్మన్ సెంథిల్ హెచ్చరించారు. దమ్ముంటే కుప్పం రావాలని సవాల్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న ఎంపీ రెడ్డప్ప వారించే ప్రయత్నం చేసిప్పటికీ.. సెంథిల్ మరింతగా రెచ్చిపోయి టీడీపీ నేతలపై బూతుల దాడి చేశారు. చేతనైతే పట్టాభి చేసిన వ్యాఖ్యలు తప్పు అని టీడీపీ నేతలు చెప్పాలని సెంథిల్ డిమాండ్ చేశారు. అటు టీడీపీ.. ఇటు వైసీపీ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేందుకు దారితీస్తున్నాయి. కుప్పంలోనూ టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
కుప్పంలో వైసీపీ, టీడీపీ ఘర్షణ..
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబుపై సెంథిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్కు ర్యాలీగా బయల్దేరారు. టీడీపీ శ్రేణులు పట్టణంలోని ఎంఆర్ రెడ్డి కూడలికి చేరుకోగా బస్టాండ్ వద్ద జనాగ్రహ దీక్ష నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే కూడలి వద్దకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అక్కడ్నుంచి పంపించివేశారు.
పట్టాభి అడ్రస్ లేకుండా పోయేవారంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
ఇది ఇలావుండగా, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభి.. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతంలో చేసి ఉంటే అడ్రస్ లేకుండా ఉండేవాడని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 2024లో చంద్రబాబుని రాష్ట్రం నుంచి పంపించేస్తే.. జగన్ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే రాష్ట్రానికి పట్టిన గ్రహణం పోతుందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని రాయల్ చెరువు లో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆయన జనాగ్రహదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
దాడులు తప్పవు.. పట్టాభి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు
పట్టాభి వ్యాఖ్యల వెనక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడితే ఆయన అభిమానులు గాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాని తప్పనిసరిగా దాడి చేస్తారన్నారు. పట్టాభి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని మహిళలు చెప్పుతో కొట్టినా సిగ్గురాదన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా భ్రష్టు పట్టించాలన్న ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజల్లోకి పోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారన్నారు. జగన్ జనరంజక పాలనకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే టీడీపీ వారు ఇలాంటి కుట్రలు చేపడుతున్నారన్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు కేతిరెడ్డి.