సమైక్యానికి జగన్తోనూ: జెసి, బాబుపై మైసురా ఫైర్
హైదరాబాద్/అనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని, అవసరమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసి పని చేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ లక్ష్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమేనని అన్నారు.
రాష్ట్ర సమైక్యంగా ఉంచడంతో కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసి పని చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడిస్తామని జెసి దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో జరగనున్న భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతారని, ఆ సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయనను కోరతామని జెసి చెప్పారు.

టి బిల్లుపై చర్చ జరగాల్సిందే: డొక్కా
తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లులో అనేక లోపాలున్నాయని అన్నారు. సభలో మాట్లాడే అవకాశం వస్తే తెలంగాణ ముసాయిదా బిల్లులోని లోపాలను తెలుపుతానని డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా.. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నియోజకవర్గాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు చెప్పిందే విధానమా..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిందే విధానమా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఏ రోజు కూడా సమైక్యం మాట ఎత్తలేదని ఆయన శనివారం మీడియాతో అన్నారు. విభజన లేఖను చంద్రబాబు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ఆయన అడిగారు. విభజనకు అనుకూలమైన పార్టీలకే ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు వేదిక కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications