ఉత్కంఠ-ఆనందయ్య మందును పరిశీలిస్తున్న ఐసీఎంఆర్-రహస్య ప్రాంతంలో-ఏం తేల్చనున్నారు?
కరోనా విరుగుడు పేరుతో కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందును పరిశీలించేందుకు సోమవారం(మే 24) ఐసీఎంఆర్ బృందం అక్కడికి చేరుకుంది. అయితే కృష్ణపట్నంలో కాకుండా అక్కడికి సమీపంలోని ఓ రహస్య ప్రాంతంలో ఐసీఎంఆర్ బృందం ఆ మందును పరిశీలిస్తోంది. ఆనందయ్య,ఆయన శిష్యులను,వారి మందు సామాగ్రిని పోలీసులు ముందే ఆ ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఐసీఎంఆర్ బృందం సమక్షంలో ఇవాళ ఆనందయ్య మందు తయారు చేయనున్నారు. మందులో వాడుతున్న మూలికలు,పదార్థాలను పరిశీలించనున్న ఐసీఎంఆర్ అధికారులు... లోతైన అధ్యయనం కోసం ఆ మందును ల్యాబ్కు పంపించే అవకాశం ఉంది.
Recommended Video
కృష్ణపట్నం జనసంద్రం-ఆనందయ్య కరోనా మందుకు విపరీత డిమాండ్-అల్లోపతి వైద్యుల విమర్శలు పట్టించుకోని జనం
ఆనందయ్య మందుపై సర్వత్రా ఉత్కంఠ...
ఆనందయ్య నాటు మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే రాష్ట్ర ఆయుష్ శాఖ తేల్చిన సంగతి తెలిసిందే. మందు తీసుకున్నవారిలోనూ ఎటువంటి దుష్పరిణామాలు లేవని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఆనందయ్య మందుపై ఏం తేల్చబోతుందన్నది ఉత్కంఠగా మారింది. మందు పరిశీలన అనంతరం ఐసీఎంఆర్ బృందం ఏదైనా ప్రకటన చేస్తుందా లేక ల్యాబ్ నివేదిక వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందేనని చెబుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలని కోరుకుంటున్న జనం...
ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వాలని నెల్లూరు వాసులతో పాటు చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పటివరకూ దాదాపు 70 వేల మంది ఆనందయ్య మందు తీసుకుని ఉంటారని... ఏ ఒక్కరిలోనూ ఆ మందు దుష్ప్రభావం చూపింలేదని చెబుతున్నారు.
8 రోజులుగా మందు పంపిణీ ఆగిపోవడం వల్ల చాలామంది కరోనాతో ఆరోగ్య సమస్యలు తీవ్రమై చాలామంది ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు. ఐసీఎంఆర్ సానుకూలంగా స్పందిస్తే ప్రభుత్వం వెంటనే మందు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
నివేదిక ఎప్పుడొస్తుంది...
ఐసీఎంఆర్ అధ్యయనం ఒక్కరోజులో పూర్తయ్యే అవకాశం లేదు. ప్రత్యక్షంగా మందు తయారీని,అందులో వాడే పదార్థాలను పరిశీలించనున్న ఐసీఎంఆర్ బృందం... ఆపై వాటిని ల్యాబ్కు పంపించనుంది. ఆ రిపోర్టులు వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందో కచ్చితంగా చెప్పలేం. అలాగే తిరుపతి,విజయవాడలకు చెందిన ఆయుర్వేద వైద్య బృందం కూడా ఆనందయ్య మందును పరిశీలించాల్సి ఉంది.
ఈ నివేదికలన్నీ అందిన తర్వాతే ప్రభుత్వం ఆనందయ్య మందుపై ఒక నిర్ణయానికి రానుంది. ఈ ప్రక్రియకు ఎంత లేదన్నా మరో వారం రోజులు పట్టవచ్చు. కాబట్టి అప్పటివరకూ మందు పంపిణీకి బ్రేక్ పడినట్లే. ఆనందయ్య కూడా ప్రభుత్వం అనుమతిస్తే తప్ప మందు పంపిణీ చేయలేని పరిస్థితి. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ సహకారం లేనిదే లక్షల మందికి ఆయన మందు పంపిణీ చేయలేరు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ఆయుర్వేద వైద్యులు
ఆనందయ్య మందును తమిళనాడుకు చెందిన కొంతమంది ఆయుర్వేద వైద్యులు పరిశీలించినట్లు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆయుర్వేద వైద్యులు కూడా మందును పరిశీలించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు అల్లోపతి వైద్యుల నుంచి ఈ మందుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అటు సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత చర్చ కొనసాగుతూనే ఉంది.
ఆకు పసరును పట్టుకుని మందుగా చెప్పడమేంటని... దానికి శాస్త్రీయత ఎక్కడిదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే అల్లోపతి వైద్యంలో కరోనాకు మందు లేనప్పుడు వ్యాధిని నయం చేసే నాటు మందును వాడితే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా చివరకు ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.