కోరుకుంటే సిఎం అవుతా, కూకట్పల్లి నుంచే: జెపి
హైదరాబాద్: ప్రజలు కోరుకుని ఆదరిస్తే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ.. తొలి జాబితాను లోక్సత్తా శుక్రవారం విడుదల చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జెపి తెలిపారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. తాము పార్టీకి విరాళాలను పారదర్శకంగా సేకరిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ వెబ్సైట్ ద్వారా మూడు రోజుల్లో 30 లక్షల రూపాయలను సేకరించినట్లు తెలిపారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు మరో రూ. 3 కోట్లను సమకూర్చేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు.

పారదర్శకంగా విరాళాలు సేకరిస్తున్న తమపై కేంద్రం ఉన్మాదంతో అడ్డుకుంటోందని ఆరోపించారు. దేశ ప్రజలకు కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని, కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజలకు పరిష్కారం చూపెడతామని జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాష్ట్రంలోనూ కొన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఐదు తరాల నుంచి ఉన్న పార్టీ అని జెపి పేర్కొన్నారు.
దేశంలో నల్లధనం రాజ్యమేలుతోందని, దొంగ డబ్బుతో ఎన్నికలు నిజాయితీగా ఎలా జరుపుతారని, మంచి రాజకీయాలు ఎలా తెస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. సాంకేతికత పెరిగిన తర్వాత ప్రజలు ప్రతీ విషయాన్ని గమనిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ఎలాంటి వారు కావాలో ఆలోచించుకోవాలని జయప్రకాశ్ నారాయణ ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications