అమరావతి రైతులతో ఒప్పందం వద్దంటే : పూర్వస్థితిలో భూముల్ని తిరిగి ఇవ్వాలి-హైకోర్టులో వాదనలు..!!
అమరావతికి భూములిచ్చిన రైతులను సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వరుసగా ఐదో రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు బడుతూ
రాజధాని వ్యాజ్యాల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును న్యాయవాదులు దుయ్యబట్టారు. భూములిచ్చిన రైతులకు రాజధాని అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని చెప్పి చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. అమరావతి కోసం రైతులు ఇచ్చిన వేల ఎకరాలకు తానే యజమాని అన్నట్లు ప్రభుత్వ వ్యవహరిస్తోందన్నారు.
రాజధాని నిర్మాణం చేయం.. భూములను మాత్రం తామే ఉంచుకుంటామంటే ఎలా అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. జీవనాధారం వదులుకొని పేద రైతులు ఇచ్చిన భూములను తీసుకొని.. తమకు నచ్చినట్లు చేస్తామంటే కుదరదన్నారు.
పూర్వ స్థితిలో భూములు..పరిహారం ఇవ్వాలి
అనుచిత లబ్ధి పొందడం కోసం పాలన వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చి శాసనాధికారాన్ని దుర్వినియోగం చేసిందని తెలిపారు. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను తీసుకొచ్చే క్రమంలో ప్రతి దశలోనూ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని వాదించారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన స్థలాలను 'నవరత్నాలు' పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం చూస్తోంది. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చకపోవడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఒప్పందం నుంచి ప్రభుత్వం వైదొలగాలంటే.. పూర్వస్థితిలో భూముల్ని తిరిగి ఇవ్వాలి, పరిహారం చెల్లించాలి.
చట్టాల ముసుగులో మోసం చేస్తున్నారు
ప్రజల హక్కులకు విఘాతం కలిగే రీతిలో ప్రభుత్వాలు శాసనాలు చేసినప్పుడు వాటిపై సమీక్షాధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. సీఆర్డీఏ చట్టం రైతులకు కల్పించిన రక్షణను ఏఎంఆర్డీఏ చట్టంతో తొలగించారు. దీంతో రైతుల హక్కులకు భంగం కలుగుతోంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను కొట్టేయండని సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు ధర్మాసనాన్ని కోరారు.
అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు పానకాలరెడ్డి, మరికొందరి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబు తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
Recommended Video
శాసనమండలిలో బిల్లుల పైనా వాదనలు
రాజధాని వ్యాజ్యాలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను పాస్ చేసే క్రమంలో ప్రభుత్వం సభా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడింది. శాసన మండలి ఛైర్మన్ బిల్లులను సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారని ఎమ్మెల్సీ అశోక్బాబు తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు.
ఆరు నెలల గడువు ముగియక ముందే శాసనసభలో మరోసారి బిల్లులు ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ ఆమోదం కోసం పంపే బిల్లులు శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ సంతకం తప్పని సరి. ఛైర్మన్ సంతకం లేకుండా స్పీకర్ బిల్లులను గవర్నర్కు పంపడం రాజ్యాంగాన్ని వంచించడమే అంటూ కోర్టుకు నివేదించారు.