చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు, ఆ ట్వీట్ మాజీ ప్రధానిదేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో తన రెండ్రోజుల పర్యటనలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాబు వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో తన రెండ్రోజుల పర్యటనలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాబు వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపై ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనాన్ని ఉద్దేశించి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న ట్వీటర్ అకౌంట్ నుంచి స్పందన వచ్చింది.
'బాబు.. ప్రజలు మిమ్మల్ని విమర్శించడం రుచించకపోతే వారి నుంచి పన్నులు వసూలు చేయడం ఆపండి, వాళ్లను ఓట్లు అడుక్కోవడం కూడా మానేయండి..' ఇదీ ఆ పోస్టు సారాంశం.
అయితే, ఇది మాజీ ప్రధాని అధికారిక ట్వీటర్ అకౌంటా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సొమ్ముతో అందుకునే పించన్లను తీసుకోవద్దని, రోడ్లపై నడవొద్దని చంద్రబాబు ఎలా అంటారని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కర్నూలులో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని వారు అంటున్నారు.
ఇంతకీ బాబు ఏమన్నారంటే..
నంద్యాలలో టీడీపీ శ్రేణులతో సమావేశమైన చంద్రబాబుతో తమ సమస్యలను చెప్పుకునేందుకు స్ధానికులు కొంతమంది వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారిని ఉద్దేశించి మాట్లాడిన బాబు.. 'సమస్యలు తర్వాత.. ముందు నేను చెప్పేది వినండి అంటూ వారిని ఆపారు.
సీఎం హోదాలో ఉన్నానన్న విషయం కూడా మరిచిపోయి.. 'కొందరు నేను ఇచ్చిన పించన్లతో బతుకీడుస్తూ.. నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ.. నాకే ఓటు వేయడం లేదు..' అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 'తనకు ఓటు వేయకపోతే.. పించన్ తీసుకోవద్దని, రోడ్లపై నడొవద్దని.. అన్నారు.
తాను ఒక్కో ఓటుకు రూ.5 వేలు కూడా ఇవ్వగలనని...అలా ఇస్తే మళ్లీ అవినీతికి పాల్పడాల్సి వస్తుందని అన్నారు. అంతేకాకుండా, తనకు ఓట్లు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానంటూ చంద్రబాబు వారితో తన అక్కసు వెళ్లగక్కారు.