జగన్ కూడా ఆ పనిచేస్తే.., చేయడం చేతకాకపోతే తప్పుకోండి: చంద్రబాబు
అగ్రిగోల్డ్, కేశవరెడ్డి సంస్ధల ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయగలుగుతున్నామని,జగన్ కూడా తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే అసలు సమస్యే ఉండదు కదా.. అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అమరావతి: అగ్రిగోల్డ్ వ్యవహరం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. డిపాజిటర్లకు ముందుగా ఇవ్వాలని సుభాష్ చందర్కు సూచించానని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... అగ్రిగోల్డ్, కేశవరెడ్డి సంస్ధల ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయగలుగుతున్నామన్నారు.
అగ్రిగోల్డ్ తరహాలోనే జగన్ కూడా తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే అసలు సమస్యే ఉండదు కదా అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోసాలకు పాల్పడేవారిని, సంస్ధలను వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన చెప్పారు.
పోలవరం పనుల జాప్యంపై సీఎం ఆగ్రహం...
పోలవరం పనులు చేస్తున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై కూడా సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను అనుకున్న విధంగా పరుగులెత్తించడంలో ట్రాన్స్ ట్రాయ్ విఫలమవుతుండటంతో 60సీ నిబంధనల కింద నోటీసులు జారీ చేశామని చెప్పారు.
అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతే తప్పుకోవాలని, మరో కాంట్రాక్టర్ కు పనులు అప్పగిస్తామని సీఎం వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పనులను మరో సంస్థకు అప్పచెప్పినా న్యాయపరమైన ఇబ్బందులేమీ తలెత్తవాని ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టు పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.