అటు వడగాల్పులు -ఇటు చల్లని కబురు, రుతుపవనాలు..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక..జూన్ 1న కేరళకు చేరుకోవాల్సిన నైరుతి రుతు పవనాలు నేటికి చేరుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు: ఏపీలో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం అల్లూరు జిల్లా చింతూరు, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 135 మండలాల్లోనూ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉమ్మడి విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 44-45డిగ్రీలు, కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాల్లో 42-43 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 39-41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులూ పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటు కూల్ న్యూస్: తెలంగాణలో వాసులకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. అక్కడక్కడ చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కురిసింది. అంతేకాకుండా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా మారింది. నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
రుతుపవనాలు ఎప్పుడు: నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళను తాకుతాయి. ఈ సారి నాలుగు రోజులు ఆలస్యంగా అంటే ఈ రోజు (జూన్ 4న) చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు, నాలుగు రోజులు అలస్యంగా ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయవ్య దిశగా పయనించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
దీనివల్ల కేరళకు రుతుపవనాలు రాకకు ఇబ్బంది లేకపోయినా పురోగతిలో మందకొడితనం కనిపించే అవకాశముందని భావిస్తున్నారు. అల్పపీడనం బలపడి తుఫానగా మారితే రుతుపవనాల విస్తరణపై ప్రభావం చూపనుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న తరువాత జూన్ 8, 9వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications