ఏపీకి దూసుకొస్తున్న తుఫాను - తాజా హెచ్చరికలు..!!
ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ రోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. బుధవారం మరింత బలపడి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దీని కారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో కోస్తాతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తాజా అలర్ట్స్
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 22న ఉదయం నాటికి వాయుగుండంగా మారి..23 నాటికి తుఫాన్గా బలపడనుంది. తర్వాత వాయవ్యంగా పయనించి 24 నాటికి ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరం దిశగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తుపాన్ గా మారి
అయితే అత్యధిక మోడళ్ల మేరకు తుఫాన్ బలపడి తీవ్ర తుఫాన్గా మారి ఈనెల 25న ఒడిశాలోని గోపాలపూర్, పూరి మధ్య లేదా.. గోపాలపూర్, జగత్సింగ్పూర్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25 ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అమెరికాకు చెందిన నోవా సంస్థ మాత్రం 25న పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని పేర్కొంది.
ఉత్తరాంధ్రలో
ఉత్తరాంధ్రలో ఈనెల 23 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కాగా.. కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications