2018లో...చంద్రబాబు ముందు సవాళ్లేనా?...ఎలా అధిగమిస్తారో?...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధించి గత ఏడాది రాజకీయ పరిణామాలను అవలోకిస్తే...ఆరంభంలో ఆధిపత్యం...మధ్యలో మిశ్రమ స్పందన...చివర్లో ప్రతికూల పరిస్థితులుగా విశ్లేషించవచ్చు. మరి 2018 లో ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉండబోతోంది?...ముందుంది సవాళ్లేనా?
2017లో రాష్ట్రంలో చోటుచేసుకున్నపరిణామాలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో చంద్రబాబుపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి?...ఒకప్రక్క పోలవరం వివాదాలు...ఇంకోప్రక్క ప్రతిపక్షనేత జగన్ పాదయాత్ర పర్యవసానాలు...మరోప్రక్క బిజెపి వ్యవహారాలు...ఈ మూడు అంశాలు 2018 లో చంద్రబాబు ముందు సవాళ్లేనా? అంటే అవుననే చెప్పుకోక తప్పదు. మరి నూతన సంవత్సరంలో తనకు సవాళ్లుగా పరిణమించే అవకాశం ఉన్న ఈ మూడు సమస్యలను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సమస్య 1: పోలవరం నిర్మాణం...
ఆంధ్రప్రదేశ్ దశాబ్ధాల కల పోలవరం ప్రాజెక్ట్. రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి తలపెట్టిన ఈ నిర్మాణం ఇదిగో అదిగో అంటూ అనేక మలుపులు తిరుగుతూ పెను వివాదాలకు కారణమవుతోంది. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2018 డెడ్లైన్కు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నసంకల్పంతో ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణాన్నికేంద్రం నుంచి తమ చేతిలోకి తీసుకున్న టిడిపి ప్రభుత్వం ఇటీవల కాలంలో వివాదాల ఊబిలో చిక్కుకుంది. అందరి దృష్టి ప్రాజెక్ట్ పైనే కేంద్రీకృతమైన దశలో చంద్రబాబు అనుకున్న సమయానికి అందరిని సంతృప్తి పరిచేలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేస్తారు? తనకు ఎదురైన ఈ సవాలును 2018లో ఎలా అధిగమిస్తారో...కాలమే సమాధానం చెప్పనుంది.

సమస్య 2: బిజెపి వ్యవహారం...
రాష్ట్రంలో బిజెపి నేతల కటువైన విమర్శలు...ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న గుంభన రాజకీయాలు చంద్రబాబునాయుడు కలవరపడక తప్పని పరిస్థితి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ తనతో వ్యవహరిస్తున్నతీరు చంద్రబాబును ఇబ్బంది పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు రెండేళ్లుగా తాను ప్రధాని అపాయిట్మెంట్ కోసం ఎదురుచూడాల్సి రావడం, ఎంత ప్రయత్నించినా మోడీ ఆ అవకాశం ఇవ్వకపోవడం చంద్రబాబును చాలా ఇరుకునపెడుతోంది. మరోవైపు తనకు అపాయిట్మెంట్ ఇవ్వని ప్రధానమంత్రి వైసిపి నేతలకు మాత్రం అవకాశం ఇస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఇక ఎపిలో భాజపా నేత సోము వీర్రాజు చంద్రబాబును విమర్శలతో వాయించేస్తున్నారు. ఆరోపణల వాడి పెంచుతూ రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సోము వీర్రాజు ఇలా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతుండటంపై అనేక ఊహాగానాలు చెలరేగుతునన్నాయి.

సమస్య 3: జగన్ పాదయాత్ర
మరోవైపు ప్రతిపక్షనాయకుడు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాల స్పందన కూడా చంద్రబాబును కలవరపెడుతోంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా జగన్ పాదయాత్రకు అనూహ్య ఆదరణ లభిస్తుండటం చికాకు పరుస్తోంది. అందుకే ప్రారంభంలో జగన్ పాదయాత్రని తేలికగా తీసుకొన్న టిడిపి రాన్రాను ఆరోపణల తీవ్రతను పెంచి చివరకు విమర్శనాస్త్రాలతో ఎదురుదాడి చేసేంతేవరకు వెళ్లాల్సివస్తోంది.

ఈ సవాళ్లను అధిగమిస్తారా?
కొత్త సంవత్సరం ఆరంభం నుంచే ఈ మూడు సవాళ్లను అధిగమించేందుకు తారాస్థాయిలో కృషి చెయ్యక తప్పని పరిస్థితి చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. మరి అపార రాజకీయ అనుభవజ్ఞుడు, అపర చాణుక్యుడైన చంద్రబాబు ఈ సమస్యలను సమర్థవంతంగా అధిగమిస్తారా లేదా అనేది 2018 లోనే తేలిపోనుంది. ఈ సవాళ్ల కు ఆయన సమాధానమే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కీలకం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications