అమరావతి పిటిషన్లపై సుప్రీంలో భారీట్విస్ట్-ఏపీ విభజన రిట్లతో కలిపి విచారణ-సీజే తప్పుకుందీ అందుకే !
అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్, రైతులు దాఖలు చేసిన పిటిషన్ల వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పిటిషన్లను కలిపి విచారించేందుకు గతంలో నిర్ణయించిన సుప్రీంకోర్టు.. అనంతరం సీజేఐ యూయీ లలిత్ విచారణ నుంచి తప్పుకోవడంతో వీటిని వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి వీటిపై విచారణ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది. అంతే కాదు ఏపీ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన 36 రిట్ పిటిషన్లను కూడా ఇందులోనే కలిపి సుప్రీంకోర్టు విచారించబోతోంది.
అమరావతి పిటిషన్ల విచారణలో ట్విస్ట్
అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. దీంతో పాటు రైతులు దాఖలు చేసిన పిటిషన్లను కలిపి విచారించాలని తొలుత నిర్ణయించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత మరిన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో అమరావతి పిటిషన్ల విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియక సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా అమరావతి, మూడు రాజధానుల వ్యవహారంలో ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందన్న దానిపై రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా ఆధారపడుతోంది.
విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ లలిత్
సుప్రీంకోర్టులో వైసీపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు రైతులు దాఖలు చేసిన కేవియట్లపై విచారణ జరిపేందుకు సిద్దమైన తరుణంలో న్యాయవాదులు వ్యక్తం చేసిన అభ్యంతరాలతో ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. గతంలో తాను 2014 నాటి ఏపీ విభజన చట్టంపై తన అభిప్రాయం చెప్పానని, ఇప్పుడు దాంతో లింక్ అయిన అమరావతి పిటిషన్లపై విచారణ చేపట్టలేనని సీజేఐ చేతులెత్తేశారు. కొత్తగా మరో బెంచ్ ఏర్పాటు చేసి ఈ పిటిషన్లపై విచారణకు డేట్ ఫిక్స్ చేయాలని రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు. అక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది.
విభజన పిటిషన్లతో కలిపి అమరావతి వాజ్యాల విచారణ
అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు చేపట్టే విచారణలో 2014 నాటి ఏపీ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను కూడా విచారించాలని సీజేఐ యూయూ లలిత్ నిర్ణయించారు.దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. గతంలో విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ 36 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ పెండింగ్ లో ఉంది. అదే సమయంలో దీంతో అమరావతి పిటిషన్లకూ లింక్ ఉందని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను విచారణ నుంచి తప్పుకుని మరీ సీజేఐ లలిత్ వీటిపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటుచేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీజేఐ లలిత్ కీలక ఆదేశాలు
విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను అమరావతి పిటిషన్లతో కలిపి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన సీజేఐ యూయూ లలిత్.. ఇప్పుడు ఆ పాత కేసులో వాటిని లిస్ట్ చేయాలన్నారు. దీంతో అప్పటి రిట్ తో ట్యాగ్ అయిన 36 పిటిషన్లు కూడా అమరావతి పిటిషన్లు కూడా విచారణకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ రఘురామ, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు ఉండవల్లి, రాయపాటి తో పాటు పలువురు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు అమరావతి పిటిషన్లతో కలిపి వీరి పిటిషన్లపైనా సుప్రీంకోర్టు కలిపి విచారణ చేయనుంది.
సుప్రీంకోర్టులో మరిన్ని ట్విస్టులు ?
ఏపీ విభజన తర్వాత విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ అడపాదడపా జరుగుతున్నా ముందుకు మాత్రం సాగడం లేదు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్, రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు పరస్పరం లింక్ ఉన్న ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే విభజన చట్టంలో రాజధాని అని పేర్కొనడాన్ని ఇరువర్గాలు తమదైన భాష్యాలు చెప్తున్నాయి. రాజధాని అంటే ఒకటేనని అమరావతి అనుకూలవాదులు, రాజధాని అంటే ఎన్నుంటే అన్ని అని మూడు రాజధానుల అనుకూలురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తేలిస్తే రాజధానులపై క్లారిటీ వచ్చేయడం ఖాయం.