ఐఏఎస్ శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ : చర్యలు తీసుకోవద్దు : సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం..!!
ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓఎంసీ చార్జిషీట్పై విచారణ ఆపాలని శ్రీలక్షి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీని పైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయంపై విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లు దాఖలు చేశాయి.
మొదట సీబీఐ కేసులు కుదరకపోతే రెండూ సమాంతరంగా విచారణ జరపాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. మొదట విచారణ జరిపి అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని ఈడీ తరఫు న్యాయవాది ప్రతిపాదించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మొదట ఏది విచారణ జరపాలన్న అంశంపై స్పష్టత లేదని ఇరువైపుల న్యాయవాదులు పేర్కొన్నారు. వివిధ కోర్టు తీర్పులు పరిశీలించి సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు.
ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని, మరో చార్జిషీట్ వేయబోమని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని తెలిపింది. మౌఖికంగా చెబితే సరిపోదని, లిఖితపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు సీబీఐ కోర్టులో తనపై విచారణ ఆపాలని శ్రీలక్ష్మి కోరారు. వాదనలు వినిపించనందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే రూ.4వేలు జరిమానా విధించిందని, ఈనెల 12న వాదనలు వినిపించకపోవతే డిశ్చార్జి పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ కోర్టు తెలిపిందని శ్రీలక్ష్మి హైకోర్టు దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్ అధికారిగా ఖరారైన శ్రీలక్ష్మి ఏపీలో జగన్ మఖ్యమంత్రి అయిన తరువాత ఏపీకి కేడర్ మార్పించుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ సైతం తన ప్రభుత్వంలో శ్రీలక్ష్మికి అవకాశం ఇవ్వాలని భావించారు. ఏపీ ప్రభుత్వంలో అధికారిగా చేరిన తరువాత కొంత కాలంలోనే శ్రీలక్ష్మి రెండు ప్రమోషన్లు అందుకున్నారు. ప్రస్తుతం స్పెపల్ చీఫ్ సెక్రట్రీ హోదాలో మున్సిపల్ శాఖ పర్యవేక్షిస్తున్నారు.